టోక్యో ఒలింపిక్స్ లో పతకం సాధించి భారతావని గర్వించేలా చేసిన తెలుగు తేజం పీవీ సింధు అంకిత భావానికి నిదర్శనంగా నిలిచిందని డిప్యూటీ సీఎం, ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సింధు ప్రదర్శన తరతరాలు చెప్పుకునేలా చరిత్ర పుటల్లో నిక్షిప్తమై ఉంటుందని కొనియాడారు. ఓటమిపాలైన చోటే 24 గంటల్లోనే పట్టుదలతో కూడిన ప్రయత్నం, సంకల్పం అంకితభావంతో అసాధ్యాలను దాటి అద్భుతం చేసిందని పేర్కొంటూ సింధుకు శుభాభినందనలు తెలిపారు. సింధుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే అన్ని ప్రోత్సాహకాలు అందజేశామని గుర్తు చేశారు. సింధూ తండ్రి తనతో పాటు వాలీబాల్ ప్లేయర్ అని ఒక స్నేహితునిగా తనకి కూడా అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. వరుసగా రెండు ఒలింపిక్స్ల్లోనూ పతకాలు అందించి ఆ ఘనత అందుకున్న తొలి భారత మహిళగా, తెలుగమ్మాయిగా ఘన కీర్తిని సాధించిన ఆమె విజయాలు యువతలో స్ఫూర్తిని కలిగిస్తాయని కృష్ణదాస్ ఆకాంక్షించారు.