వేలాది కూలీలు, భారీ మెషీనరీతో, వాహనాల రాకపోకలతో కోలాహలంగా నిర్మాణ పనులతో కళకళలాడిన అమరావతిని స్తబ్దుగా, నిస్తేజంగా చూస్తుంటే బాధేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పోటీబడి అభివృద్ధి చేస్తారని ఆశించిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నీరుగార్చడం ప్రజాద్రోహమని ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. విభజన నష్టాన్ని అధిగమించే సంపద సృష్టి కేంద్రంగా, యువత ఉద్యోగ అవకాశాల కార్యస్థానంగా మన రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగి నేటికి 5ఏళ్లు..మూడున్నరేళ్లుగా నిరాఘాటంగా సాగిన నిర్మాణ పనులను గత ఏడాదిన్నరగా ఆపేసి అభివృద్దిని ఆపేశారని చంద్రబాబు మండిపడ్డారు.
శంకుస్థాపన సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగం, ఆ వేడుకకు హాజరైన దేశ విదేశీ ప్రముఖుల సందేశాల స్ఫూర్తిని కాలరాశారని ధ్వజమెత్తారు. అవాస్తవ ఆరోపణలతో, అభూత కల్పనలతో అమరావతిపై దుష్ప్రచారం చేశారని చంద్రబాబు విమర్శించారు. రూ.10వేల కోట్లతో చేసిన అభివృద్ది పనులను నిరుపయోగం చేశారని అన్నారు. వ్యక్తిపైనో, పార్టీపైనో కక్షతో రాజధాని నిర్మాణ బృహత్తర యజ్ఞాన్ని భగ్నం చేయడం రాక్షసత్వమని చంద్రబాబు విమర్శించారు.
13వేల గ్రామాలు, 3వేల వార్డుల నుంచి ఊరేగింపుగా తెచ్చిన పవిత్ర మట్టిని, పుణ్య జలాలతో అభిషేకించి శక్తి సంపన్నం చేసిన మన రాజధానిని కాపాడుకోవడం ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడి కర్తవ్యమని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం 34 వేల ఎకరాల భూములిచ్చిన రైతుల భవిష్యత్తును అంధకారంలో ముంచిన ప్రస్తుత పాలకుల దుశ్చర్యలను నిరసించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం కోసం రోడ్లపాలైన అమరావతి రైతులు, మహిళలు, రైతుకూలీలకు సంఘీభావం తెలపాలని అన్నారు. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కాపాడాలని అన్నారు.