గత ప్రభుత్వ హయాంలో నియమించిన పాలక మండలి అక్రమాలపై విచారణ జరిపించాలనినిర్ణయించినట్టు టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. ఆదివారం తిరుమలలోని తన కార్యాలయంలో మీడియాలో మాట్లాడుతూ దర్శనాల నుంచి ప్రసాదాల వరకు గత పాలకమండలిలో అక్రమమార్గం పట్టాయని, ఇందుకు కొందరు అధికారులు కూడా సహకరించినట్టు తెలుస్తోందన్నారు. కేవలం గత పాలకులు, అధికారుల స్వార్థం కోసం ఎల్-1, ఎల్-2, ఎల్-3 ప్రత్యేక దర్శనాలు విభజన చేసి అయినకాడికి దండుకున్నారని, ఈ దర్శనాల కారణంగానే భక్తులు నేటికీ ఇబ్బంది పుడుతున్నారని, వారికి స్వామి దర్శనం 14 నుంచి 20 గంటల సమయం పడుతుందన్న ఆవేదన ఇటీవల భక్తుల మధ్యకు వెళ్లినప్పుడు తనకు ఫిర్యాదు చేసారని చెప్పారు. ఈ క్రమంలోనే భక్తులకు 5, 6 గంటల్లో దర్శనం కల్పించేందుకు వీలుగా ప్రత్యేక దర్శనాలు రద్దు చేసేందుకు చర్యలు తీసుకొంటామని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు.