దేశవ్యాప్తంగా బీజేపీ విజయ దుందుభి మోగిస్తోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఊహించని విధంగా గెలుపువైపు పరుగులు పెడుతోంది. ఢిల్లీలోని ఏడు లోక్సభ నియోజవర్గాల్లోనూ బీజేపీయే గెలిచింది. మొత్తం ఏడు లోక్సభ స్థానాల్లో విజయం సాధించి క్లీన్స్వీప్ చేసింది. డిల్లీ ఈస్ట్ నుంచి పోటీ చేసిన మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఘన విజయం సాధించారు. ఢిల్లీ అధికార పార్టీ ఆప్ నుంచి బరిలో నిలిచిన అతిషీ, కాంగ్రెస్ అభ్యర్థి అర్విందర్ సింగ్ లవ్లీలను వెనుకకు నెట్టి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఈశాన్య ఢిల్లీ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కూడా ఓటమిని చవిచూశారు. గంభీర్.. మోదీకి, బీజేపీకి అనుకూలంగా ట్విటర్, ఫేస్ బుక్ తదితర సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రచారం చేశారు. దీంతో కాషాయ దళం ఆయనకు టికెటిచ్చి బరిలోకి దింపింది. అయితే బీజేపీ ఇంతలా తన సత్తా చాటడానికి ప్రధాన కారణం నరేంద్ర మోదీ చరిష్మా అంటున్నారు. మోదీ హవాతోనే తొలిసారి ఏడు స్థానాలను కైవసం చేసుకుని బీజేపీ సత్తాచాటిందని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.