శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా చిన్నసాన ఎత్తిపోతల పథకం శిలాఫలకాన్ని ఆవిష్కరించి, తోటపల్లి పాత ఆయకట్టు కాల్వల ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎచ్చెర్ల అంబేడ్కర్ వర్సిటీలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ‘‘రాష్ట్రంలో మూడేళ్లుగా తక్కువ వర్షపాతం ఉంది.. ప్రకృతితో అందరం మమేకం కావాలి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని ఇంజినీర్ల దినోత్సవంగా నిర్వహిస్తున్నాం. కాటన్ దొర రాష్ట్రంలో మూడు బ్యారేజీలు నిర్మించారు. బ్యారేజీల వల్ల ప్రజల ఆర్థిక స్థితిగతుల్లో పెనుమార్పులు వచ్చాయి. కేఎల్రావు, శివరామకృష్ణ రాష్ట్రానికి దిశ, దశ నిర్దేశించారు. జిల్లాలో 9లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీళ్లిస్తాం. రాబోయే సీజన్ కల్లా రూ.190 కోట్లతో పనులు పూర్తి చేస్తాం.
నష్టపోయిన రైతులకు ఉదారంగా పరిహారం ఇచ్చాం. రాష్ట్రంలో 57 ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నాం. మార్చి నాటికి 27 ప్రాజెక్టులు చేపట్టేలా ముందుకెళ్తున్నాం. రణస్థలం ప్రభుత్వాసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా మారుస్తాం. జిల్లాకు బీ ఫార్మసీ కళాశాల మంజూరు చేస్తాం. శ్రీకాకుళం జిల్లాలో సమృద్ధిగా వనరులు ఉన్నాయి... జిల్లాను బ్రహ్మాండంగా తయారు చేస్తాం’’ అని చంద్రబాబు వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్రమంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, ఎంపీలు రామ్మోహన్నాయుడు, అశోక్గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు.