అమరావతి: వైసీపీ ట్రాప్లో టీడీపీ పడిపోయిందని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ పథకం ప్రకారమే కేంద్రంపై చంద్రబాబు బురద జల్లుతున్నారని ఆరోపించారు. ప్రత్యేక విమానాల్లో తిరగడం తప్ప ఏపీకి చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. పోలవరం జాప్యానికి చంద్రబాబు అసమర్థత కాదా? అని ప్రశ్నించారు. తన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు బీజేపీని దోషిగా నిలబెట్టే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని, భయంతోనే హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని విమర్శించారు. ప్రజలు చంద్రబాబును టెంపరరీ సీఎంగానే చూస్తున్నారని పేర్కొన్నారు. విదేశాలు తిరిగి చంద్రబాబు ఏపీకి ఎన్ని పెట్టుబడులు తెచ్చారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. బాబు సొంత సంస్థ హెరిటేజ్నే ఏపీకి ఎందుకు తీసుకురాలేదన్నారు. టీడీపీ నేతలు తమ సంస్థలను ఏపీకి తీసుకురావడం లేదని ఆరోపించారు.