సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. గాజు గ్లాస్ గుర్తును వేరే వారికి కేటాయించడంపై జనసేన పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది. సమస్యను 24 గంటల్లో పరిష్కరిస్తామని హైకోర్టుకు ఎన్నికల కమిషన్ న్యాయవాది హామీ ఇచ్చారు. తాము పొత్తులో ఉన్నామని అందువలన గ్లాస్ గుర్తుపై కన్ఫ్యూజన్ ఉందని జనసేన న్యాయవాది అన్నారు. ఈ పిటిషన్లో టీడీపీ ఇంప్లేడ్ అయింది. ఒక పార్టీకి ఇచ్చిన గుర్తును వేరేవాళ్లకు ఎలా ఇస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. కాకినాడలో తమ ఎంపీ అభ్యర్థికి గ్లాస్ గుర్తు ఉందని, అసెంబ్లీ ఇండిపెండెంట్ అభ్యర్థికి గ్లాస్ గుర్తు ఇచ్చారని జనసేన న్యాయవాది తెలిపారు. దీనిపై 24 గంటల్లో క్లారిటీ ఇచ్చి తాజా ఉత్తర్వులు ఇస్తామని ఎన్నికల కమిషన్ న్యాయవాది స్పష్టం చేశారు.కాగా ‘జనసేన’ గుర్తు... గాజు గ్లాసు! మరి... ఇతరులకూ అదే గుర్తు కేటాయిస్తే!? ఓట్లాటలో మాయోపాయానికి తెరలేపినట్లే! కూటమి ఓట్లను చీల్చే కుట్ర అమలు చేస్తున్నట్లే! ఓటమి భయం పట్టుకున్న వైసీపీ... ఇప్పుడు ఇదే దొంగాట మొదలుపెట్టింది. జనసేన అభ్యర్థులు లేనిచోట... జనసేన గుర్తయిన గాజు గ్లాస్ను స్వతంత్రులకు కోరి సాధించుకునేలా కుట్ర పన్నింది. రాష్ట్రంలో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో జనసేన 21 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. కూటమిగా పోటీ చేస్తున్నందున... జనసేనకు మాత్రమే గాజు గ్లాసు గుర్తు కేటాయించాలని, ఇతరులకు ఆ గుర్తు ఇవ్వొద్దని ఇప్పటికే ఈసీని కోరారు. అయితే... జనసేన పార్టీకి చెందిన గాజుగ్లా్సను ఈసీ కామన్ సింబల్గా ప్రకటించింది. అంటే... జనసేన తరఫున బరిలో ఉన్న అభ్యర్థులందరికీ ఇదే గుర్తును కేటాయిస్తారు. అదే సమయంలో... ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో కామన్ సింబల్గా ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజుగ్లాస్ గుర్తును ఇచ్చేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన కొద్ది సేపటికే ఇండిపెండెంట్లకు గుర్తుల కేటాయింపు పూర్తిచేయాలి. కానీ... సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయినా, రాత్రి పొద్దుపోయేదాకా పలుచోట్ల ఈ ప్రక్రియ ముగియలేదు. అంటే... గ్లాసు గుర్తు కోరుకునే వారికోసమే ఈ కాలయాపన చేశారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కడపటి వార్తలు అందేసరికి... రాష్ట్ర వ్యాప్తంగా 16 అసెంబ్లీ, మూడు లోక్సభ స్థానాల్లో ఇండిపెండెంట్లు, ఇతరులకు గాజుగ్లాసు గుర్తు కేటాయించినట్లు తెలిసింది. ఇందులో... బీజేపీ ఎంపీ అభ్యర్థులున్న అనకాపల్లి, రాజమహేంద్రవరం కూడా ఉన్నాయి. నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరిలోనూ ఒక అభ్యర్థికి గ్లాసు గుర్తు కేటాయించారు.