ముస్లింలను మోసం చేయాలని ప్రయత్నిస్తే చంద్రబాబు పార్టీకి పుట్టగతులుండవని హెచ్చరించారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్ బాషా. ముస్లిం జీవితాలతో ఆడుకునే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఖాదర్ బాషా మీడియాతో మాట్లాడారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ముస్లింలకు కల్పించిన 4 శాతం రిజర్వేషన్ ఎత్తివేసేందుకు బీజేపీతో కలిసి చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని మండిపడ్డారు. బీజేపీ నేతలంతా తాము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తానంటున్నారని, వాళ్లతో ఆ ప్రకటనలు ఉపసంహరించుకునేలా చేసే దమ్ముందా..? ఇటీవల కేంద్రమంత్రి పీయుష్ గోయల్ రాష్ట్రానికి వచ్చి ఇదే ప్రకటన చేశారని గుర్తుచేశారు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ఎటువంటి పొరపాటు చేసినా చంద్రబాబును ముస్లింలు క్షమించరని హెచ్చరించారు. టీడీపీ హయాంలో ముస్లింలకు ఇచ్చిన హామీలు అమలుచేయమని అడిగితే కేసులు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు. రిజర్వేషన్లపై బీజేపీ వైఖరి స్పష్టంగా తెలిసింది కాబట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముస్లిం రిజర్వేషన్పై వారి అభిప్రాయం చెప్పాలడి ఖాదర్ బాషా డిమాండ్ చేశారు. గుంటూరులో నారా హమారా సదస్సులో నంద్యాలకు చెందిన పేద ముస్లిం యువకులపై చంద్రబాబు దేశద్రోహం కేసులు పెట్టించాడని, దాచేపల్లిలో మైనారిటీలను జైల్లో పెట్టించాడని గుర్తుచేశారు. గతంలో 650 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు.