వాషింగ్టన్: పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు సైతం తుపాకులను ఉపయోగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఫ్లోరిడాలోని ఓ హై స్కూల్లో మాజీ విద్యార్థి విచక్షణారహితంగా కాల్పుల జరిపిన ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వీరిలో 14 మంది విద్యార్థులే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విమర్శలు చెలరేగాయి. విషాద ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు, బాధితులతో వైట్హౌస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ట్రంప్ పాల్గొని మాట్లాడారు. గన్ ఫ్రీ జోన్ ఉండటం వల్ల ఉన్మాదులు అక్కడి వచ్చి కాల్పులు జరుపుతున్నారని ఇక గన్ ఫ్రీ జోన్ లేకపోతే ఇలాంటి ఘటనలు మున్ముందు జరిగే అవకాశాలు తగ్గుతాయని అన్నారు. పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయుల్లో 20శాతం మందికి తుపాకులను ఎలా వినియోగించాలో ప్రత్యేక శిక్షణ ఇస్తామని ఈ సందర్భంగా వెల్లడించాడు. తుపాకుల యాజమానులకు నిబంధనలు కఠినతరం చేస్తామని, భవిష్యత్లో కొత్త వారికి జారీ చేసేటప్పుడు పక్కా ప్రణాళికతో వారికి అనుమతులు ఇస్తామని ట్రంప్ పేర్కొన్నారు.