టీడీపీ నుంచి మరి కొందరు ఎమ్మెల్యేలు వైసీపీ గూటికి చేరనున్నారా?, చంద్రబాబుకు భారీ షాక్ ఇచ్చేందుకు వైసీపీ పెద్దలు వ్యూహాలు రచిస్తున్నారా? ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన ఈ వాఖ్యలను పరిశీలిస్తే ఈ ప్రశ్నలు నిజం కానున్నట్లు అర్థమవుతోంది. శనివారం మీడియాతో మాట్లాడిన మంత్రి టీడీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీపై వ్యతిరేకంగా ఉన్నారన్నారు. టీడీపీలో ఉన్న ఇబ్బందులను వారంతా మాతో చెబుతున్నారని వ్యాఖ్యానించారు. త్వరలోనే మరి కొంత మంది నేతలు వైసీపీలోకి వస్తారని చెప్పారు. అయితే ప్రజల్లో పలుకుబడి ఉన్న నేతలు వస్తే వైసీపీలోకి తీసుకుంటామని బాలినేని స్ఫష్టం చేశారు. ఇప్పటికే టీడీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతు తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లోనూ టీడీపీకి ఓటు వేయకుండా తమ ఓట్లు చెల్లకుండా చేశారు. మరో టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఓటు కూడా చెల్లకుండా పోవడంతో... ఆమె కూడా పక్కచూపులు చూస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి బాలినేని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.