ఏపీ ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో ఏ స్థానంలో ఎంతమంది బరిలో ఉన్నారనే దానిపై ఓ క్లారిటీ వచ్చింది. అయితే నామినేషన్ ఉపసంహరణ ముగిసిన తర్వాత ఏపీ ఎన్నికల్లో ఓ విచిత్రమైన పరిస్థితి తలెత్తింది. దీంతో టీడీపీ కూటమికి కొత్త తలనొప్పులు వచ్చిపడ్డాయి. విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ రెబల్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మీసాల గీత బరిలో ఉన్నారు. టీడీపీ అధిష్టానం టికెట్ను పూసపాటి అదితి గజపతిరాజుకు కేటాయించడంతో మీసాల గీత అసంతృప్తికి గురయ్యారు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ ఉపసంహరించుకోకపోవటంతో ఎన్నికల సంఘం మీసాల గీతకు గుర్తును కేటాయించింది. ఆ గుర్తే ఇప్పుడు టీడీపీ నేతలను ఇబ్బంది పెడుతోంది.
ఏపీలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఇండిపెండెంట్లకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయించారు. ఈ క్రమంలోనే విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా పోటీచేస్తున్న మీసాల గీతకు గ్లాస్ గుర్తు కేటాయించారు. దీంతో టీడీపీ కూటమి నేతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు. అయితే జనసేన పార్టీకి అధికారిక ఎన్నికల గుర్తు లేదు. ఈసీ దగ్గర ఫ్రీసింబల్గా ఉన్న గాజు గ్లాసు గుర్తుపైనే జనసేన పోటీ చేస్తూ వస్తోంది. ఏపీ ఎన్నికల కోసం తమకు ఈ గుర్తు కేటాయించాలంటూ ఈసీ దగ్గర, కోర్టుల్లో న్యాయపోరాటం జరిపి మరీ జనసేన నేతలు ఈ గుర్తు దక్కించుకున్నారు. ఈ గుర్తుపైనే 21 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లలో జనసేన పోటీ చేస్తోంది.
అయితే ఎన్నికల సంఘం దగ్గర ఇప్పటికీ కూడా గాజు గ్లాస్ ఫ్రీ సింబల్గా ఉంది. దీంతో ఇండిపెండెంట్ అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు ఈ గుర్తు కేటాయించారు. ఫలితంగా జనసేన పోటీలో ఉన్న స్థానాల్లో.. ఈ గుర్తు జనసేన పార్టీ అభ్యర్థులకు ఉంటుంది. జనసేన పోటీలో లేని స్థానాలు అంటే టీడీపీ, బీజేపీ పార్టీలు పోటీచేస్తున్న చోట్ల ఎవరైనా స్వతంత్రులు బరిలో ఉంటే రిటర్నింగ్ అధికారులు వారికి గ్లాసు గుర్తు కేటాయించే అవకాశం ఉంది.
ఈ క్రమంలోనే విజయనగరం టీడీపీ రెబల్ అభ్యర్థి మీసాల గీతకు గాజు గ్లాస్ సింబల్ వచ్చింది. అలాగే శృంగవరపుకోట, జగ్గయ్యపేట, మైదుకూరు, విజయవాడ లోక్ సభ స్థానాల్లో స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. ఈ పరిణామంతో కూటమి నేతలు ఇబ్బందుల్లో పడ్డారు. స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించవద్దంటూ ఎన్నికల సంఘానికి ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. మరోసారి ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లే పనిలో ఉన్నారు.