ఓ వైపు కూతురు.. మరోవైపు కొడుకు. మధ్యలో వైసీపీ మంత్రి. ఏపీ రాజకీయాల్లో నెలకొన్న ఆసక్తికరమైన కథ ఇది. ఎన్నికల కురుక్షేత్రంలో కన్న కూతురు ఓవైపు, కొడుకు మరోవైపు నిలబడి తలబడుతుంటే ఆ వైసీపీ మంత్రి కూతురికి సపోర్ట్గా నిలుస్తున్నారు. మరి ఎన్నికల పోరులో మంత్రి మద్దతిస్తున్న కూతురు గెలుస్తుందా.. కొడుకు నెగ్గుతాడా అనేది ఆ నియోజకవర్గ ఓటర్లే డిసైడ్ చేయనున్నారు. ఈ పరిస్థితి అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో నెలకొంది.
ఏపీ ఎన్నికల్లో మరో ఘట్టం పూర్తైంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తికాగా.. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల లెక్క తేలిపోయింది. ఈ క్రమంలోనే మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గంలో ఆసక్తికరమైన పోరు నడుస్తోంది. మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ప్రస్తుతం అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. ఈ క్రమంలోనే మాడుగుల టికెట్ను బూడి ముత్యాలనాయుడు కుమార్తె ఈర్ల అనురాధకు వైసీపీ అధిష్టానం కట్టబెట్టింది. అయితే ఇక్కడే సీన్ రివర్సైంది. బూడి ముత్యాల నాయుడు రాజకీయ వారసుడిగా తనకు అవకాశం ఇవ్వకుండా అనురాధకు ఎలా టికెట్ ఇస్తారంటూ బూడి ముత్యాలనాయుడు కుమారుడు రవి పోటికి దిగారు.
ఈర్ల అనురాధ వైసీపీ నుంచి పోటీచేస్తుండగా.. బూడి రవి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాడుగుల నుంచి బరిలోకి దిగారు. అయితే నామినేషన్ ఉపసంహరించుకుంటారని భావించినప్పటికీ.. రవి పోటీకే మొగ్గు చూపారు. అసలు విషయం ఏమిటంటే బూడి ముత్యాల నాయుడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య కొడుకు రవి కాగా.. రెండో భార్య కూతురు అనురాధ. అనురాధ ప్రస్తుతం జెడ్పీటీసీగా వ్యవహరిస్తున్నారు. అయితే జెడ్పీటీసీ ఎన్నికల సమయంలోనూ తాను పోటీచేయలేదంటున్న రవి.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా పోటీ నుంచి తప్పుకున్నానని చెప్తున్నారు.
అయితే బూడి ముత్యాల నాయుడు రాజకీయ వారసుడిగా మాడుగుల నుంచి ఈ ఎన్నికల్లోనైనా తనకు అవకాశం ఇవ్వాల్సిందని.. కానీ వైసీపీ అధిష్టానం అలా చేయకపోవటంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు చెప్తున్నారు. అలా చెప్తూనే నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ ఉపసంహరణ గడువు పూర్తయ్యేలోగా రవి నామినేషన్ ఉపసంహరించుకుంటారని.. బూడి ముత్యాల నాయుడు సర్దిచెప్తారని వైసీపీ వర్గాలు భావించాయి. కానీ అలా జరగకపోవటం.. పోటీకి రవి మొగ్గుచూపటంతో వైసీపీ శ్రేణులు అయోమయంలో పడ్డాయి.