పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం గురించి ప్రస్తుతం రాష్ట్ర వ్యా్ప్తంగా చర్చ నడుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ పోటీలో ఉండటమే దీనికి కారణం. అయితే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి రోజుకోవార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అందులో ప్రధానంగా వినిపిస్తున్న వార్త ఏంటంటే.. పిఠాపురం టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ వైసీపీలో చేరుతున్నారనేది. అయితే ఈ వార్తలపై వర్మ క్లారిటీ ఇచ్చారు. తాను వైసీపీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలపై స్పందించిన వర్మ.. వైరల్ అవుతున్న వార్తలపై స్పష్టత ఇచ్చారు.
ఎస్వీఎస్ఎన్ వర్మ 2014లో పిఠాపురంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీలో చేరిన ఆయన 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే పార్టీని అట్టిపెట్టుకుని నియోజకవర్గంలో క్యాడర్ను కాపాడుకుంటూ వచ్చిన వర్మ 2024 ఎన్నికల్లో మరోసారి టీడీపి టికెట్ ఆశించారు. అయితే పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు వెళ్లడం, ఆ పార్టీ నుంచి జనసేనాని స్వయంగా బరిలోకి దిగుతుండటంతో వర్మ తప్పుకోవాల్సి వచ్చింది. తొలుత అసంతృప్తిని వ్యక్తం చేసినప్పటికీ.. అధినేత చంద్రబాబు స్వయంగా వర్మకు సర్దిచెప్పారు. అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ సైతం తన ఎన్నికల ప్రచారంలో వర్మకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు.
ఇలాంటి సమయంలో వర్మ పార్టీ మారుతున్నారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఎస్వీఎస్ఎన్ వర్మ.. తాను పార్టీ మారేది లేదని తేల్చి చెప్పారు, తాను చంద్రబాబు మనిషినని.. 2014 నుంచి తనను వైసీపీలో చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అయితే అది జరగని పని అని చెప్పిన ఎస్వీఎస్ఎన్ వర్మ.. పిఠాపురంలో ఓడిపోతామని తెలిసీ ఇలాంటి వార్తలు పుట్టిస్తున్నారని మండిపడ్డారు. పనిలో పనిగా వైఎస్ జగన్ మీద కూడా సెటైర్లు వేశారు. ఎన్నికలయ్యాక వైసీపీ అధినేత జగనే.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతారంటూ సెటైర్లు వేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.