పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ సామర్థ్యం పెంపు అంశంపై ఏపీ సీం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం ఇచ్చే ప్రయత్నం చేశారు. 881 అడుగులు ఉన్నప్పుడే 44 వేల క్యూసెక్కులు తీసుకోగలమని ఆయన తెలిపారు. 854 అడుగుల్లో ఉంటే కేవలం 7వేల క్యూసెక్కులు మాత్రమే తీసుకోగలమని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో రాయలసీమ కరువు ఎలా తీర్చాలి ? అని ఆయన వ్యాఖ్యానించారు. 800 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడు తెలంగాణ నీళ్లు తీసుకెళ్తోందని సీఎం జగన్... అదే 800 అడుగుల వద్ద మాకు కేటాయించిన నీళ్లను తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలా తీసుకోవడం వల్ల ఎవరికీ నష్టం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పుడే రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మన పాలన–మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వ్యవసాయం, అనుబంధ రంగాలపై జరిగిన సమీక్షలో ఏపీ సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు సీఎం జగన్ వ్యాఖ్యలతో పోతిరెడ్డిపాడుపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గే అవకాశం లేదనే స్పష్టమవుతోంది. ఇందుకోసం ఇప్పటికే జగన్ సర్కార్ విడుదల చేసిన జీవో నెంబర్ 203తో ఇరు రాష్ట్రాల్లో దుమారం మొదలైంది. దీనిపై కృష్ణా రివర్ బోర్డుతోపాటు ఎపెక్స్ కౌన్సిల్కు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కూడా ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య మరోసారి జలవివాదం ముదురుతోంది.