కరోనా వ్యాప్తికి సమాంతరంగా పరిశోధనలు, అధ్యయనాలు కూడా చురుగ్గా సాగుతున్నాయి. తాజాగా స్వాన్ సీ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో ఆసక్తికర అంశం వెల్లడైంది. వ్యక్తుల ఉంగరం వేలు పొడవుగా ఉంటే వారికి కరోనా ముప్పు తక్కువని, ఉంగరం వేలు పొట్టిగా ఉంటే కరోనా ముప్పు అధికం అని గుర్తించారు. ఈ క్రమంలో 41 దేశాలకు చెందిన పురుషుల ఉంగరం వేళ్లపై పరిశోధన నిర్వహించారు. ఉంగరం వేలు పెరుగుదలకు గర్భంలో పిండంపై టెస్టోస్టిరాన్ ప్రభావానికి సంబంధం ఉంటుందని పరిశోధకులు వివరించారు.
ఎలాగంటే... గర్భంలోని ఓ పిండం ఎంత ఎక్కువగా టెస్టోస్టిరాన్ ప్రభావానికి గురైతే ఉంగరం వేలు అంత పొడవు పెరుగుతుందట. పిండం తక్కువ మోతాదులో టెస్టోస్టిరాన్ ప్రభావానికి గురైతే ఉంగరం వేలు తక్కువ పొడవు పెరుగుతుందట.
ఇక, టెస్టోస్టిరాన్ హార్మోన్ కరోనా విషయంలో ఎందుకు ప్రస్తావనకు వస్తోందంటే.... టెస్టోస్టిరాన్ హార్మోనే కరోనా నుంచి కాపాడే రక్షక కవచాలు అనదగ్గ ఏసీఈ-2 రిసెప్టర్లను శరీరంలో ఉత్పత్తి చేస్తుంది. ఓ వ్యక్తికి కరోనా సోకినప్పుడు వైరస్ తాలూకు లక్షణాలు తగ్గించడంలో ఏసీఈ-2 రిసెప్టర్లు ఇతోధికంగా తోడ్పడతాయి. ఈ పరిశోధన ద్వారా వెల్లడైన అంశం ఏంటంటే, తక్కువ టెస్టోస్టిరాన్ స్థాయి ఉన్న పురుషులకు కరోనాతో మరణించే ముప్పు ఎక్కువట. ఈ టెస్టోస్టిరాన్ స్థాయిని ఉంగరం వేలు పొడవు ఆధారంగా అంచనా వేయొచ్చని స్వాన్ సీ వర్సిటీ పరిశోధకుల అధ్యయనం చెబుతోంది.