ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రయివేటు డిగ్రీ కాలేజీలు, ఇంజినీరింగ్ కాలేజీలు మూసివేసేందుకు రంగం సిద్దం చేసిందా? అంటే అవుననే వినిపిస్తోంది. ముఖ్యంగా నారాయణ, చైతన్యతో పాటు పలు విద్యాసంస్ధల ఆర్ధిక మూలాలపై వేటు వేసేందుకు వైసిపి సిద్దమైనట్టే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే విద్యా రంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ.. ఉన్నత విద్యలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని కాలేజీల పనితీరును అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం 500 డిగ్రీ కాలేజీలు, 200 ఇంజినీరింగ్ కాలేజీలు మూసివేయాలని సర్కారుకు నివేదించింది. ఉత్తీర్ణత శాతం విషయంలో ప్రైవేట్ డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల కన్నాప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులే మంచి ఫలితాలు సాధిస్తున్నారని వివరించింది. ప్రైవేట్ కాలేజీల్లో విద్యా ప్రమాణాలు సన్నగిల్లిపోగా.. మౌలిక వసతులు కూడా సక్రమంగా లేవని, 71% ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు (817) అద్దె భవనాల్లో పనిచేస్తుండటం వల్ల ప్రైవేట్ సంస్థల్లో ఉత్తీర్ణతాశాతం బాగా తక్కువగా ఉందని తెలిపింది. 40 శాతం ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో (464) 25 శాతం కన్నా తక్కువగా అడ్మిషన్లు జరుగుతుండగా 58 శాతం ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో (185)నూ 50% కన్నా తక్కువగానే అడ్మిషన్లు జరుగుతున్నాయని పేర్కొంది. ఈ క్రమంలో రాష్ట్రంలో మొత్తం 1,153 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలుండగా అందులో 500 కాలేజీలను మూసివేయాలని కమిటీ తేల్చింది. అలాగే, మొత్తం 287 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలుండగా అందులో 200 కాలేజీలను మూసేయవచ్చునని కమిటీ సూచించింది. దీంతో ప్రధానంగా పలు ప్రయివేటు కళాశాలలో ముఖ్యంగా నారాయణ, చైతన్యలపైనే గురి చూసినట్టు తెలుస్తోంది.