ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ మొబైల్ నంబర్లు, మెయిల్ ఐడీలు రద్దు.. టీటీడీ కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 13, 2024, 07:58 PM

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నూతన ఈవోగా నియమితులైన జె. శ్యామలరావు తిరుమల కొండపై ప్రక్షాళన చేపడుతున్నారు. కలియుగ వైకుంఠమైన తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. తిరుమల శ్రీవారి అన్నప్రసాదం దగ్గర నుంచి శ్రీవారి లడ్డూ నాణ్యత వరకూ.. క్యూలైన్లలో భక్తులకు కల్పించే సదుపాయాల నుంచి.. షాపుల్లో ఎమ్ఆర్పీ రేట్ల వరకూ ప్రతి విషయంలోనూ కీలక చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే తిరుమల కొండపై దళారీ వ్యవస్థను కట్టడి చేసేందుకు, దళారుల ప్రమేయం లేకుండా భక్తులకు పారదర్శకమైన సేవలు అందించేందుకు టీటీడీ ఈవో చర్యలు చేపడుతున్నారు.


మరోవైపు టీటీడీ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో అందించే సేవలకు సంబంధించి కొంతమంది మధ్యవర్తులు భక్తులను మోసం చేసి, భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు టీటీడీ గుర్తించింది. గతేడాది కాలంలో ఆన్‌లైన్‌లో జరిగిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, డిప్, ఆర్జిత సేవలు, వసతి సేవల బుకింగ్‌లపైనా, అలాగే ఆఫ్ లైన్ సేవలైన ఎస్ఎస్‌డీ టోకెన్లు, వసతి సేవల బుకింగ్‌ల మీద టీటీడీ విచారణ జరిపింది. ఈ విచారణలో ఒకే మొబైల్ నంబర్, మెయిల్ ఐడీల మీద ఎక్కువ సంఖ్యలో బుకింగ్స్ జరిగినట్లు టీటీడీ గుర్తించింది. ఈ ఏడాది కాలంలో తిరుమలలో ఒకే మొబైల్ నంబరుతో 110 గదులు పొందినట్లు టీటీడీ గుర్తించింది. అలాగే ఆన్‌లైన్ బుకింగ్‌లో ఒకే మొబైల్ నంబర్‌ను ఉపయోగించి 807 వసతి బుకింగ్‌లు, ఒకే ఈమెయిల్ ద్వారా 926 వసతి బుకింగ్స్ జరిగినట్లు టీటీడీ అధికారులు గుర్తించారు.


 అలాగే ఒకే నంబర్ ద్వారా 1,279 డిప్ రిజిస్ట్రేషన్‌లు, ఒకే మెయిల్ ద్వారా 48 డిప్ రిజిస్ట్రేషన్‌లు, ఒక్క ఐడీ ప్రూఫ్ ద్వారా 14 ఎస్ఎస్‌డీ టోకెన్లు పొందినట్లు టీటీడీ విచారణలో వెల్లడైంది. ఇలాంటి మోసపూరిత ఘటనలను గుర్తించిన టీటీడీ యాజమాన్యం.. ఆన్‌లైన్ సేవలలో పారదర్శకత పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. బల్క్ బుకింగ్‌లకు ఉపయోగించే మొబైల్ నంబర్‌లు, మెయిల్స్, ఐడీ ప్రూఫ్‌లను టీటీడీ రద్దు చేసింది.


అలాగే ఫేక్ మొబైల్ నెంబర్లు, మెయిల్స్, ఐడీ ప్రూఫులను ఉపయోగించి ఇప్పటికే చేసిన బుకింగ్‌లు అనుమతించమని టీటీడీ స్పష్టం చేసింది. మరోవైపు మోసపూరిత విధానాలను అరికట్టేందుకు దళారుల ప్రమేయం లేకుండా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా భక్తులు సేవలు పొందేలా టీటీడీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. భక్తుల ధృవీకరణ కోసం ఆధార్ సేవలను ఉపయోగించేలా చర్యలు చేపడుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com