ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోల్‌కతా డాక్టర్‌ పోస్ట్‌మార్టం రిపోర్ట్ మాయం.. దీదీ సర్కార్‌పై సుప్రీం ఆగ్రహం

national |  Suryaa Desk  | Published : Mon, Sep 09, 2024, 09:26 PM

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ ఆస్పత్రిలో గత నెల ఓ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపగా.. ఈ కేసును సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా తాజా విచారణ వేళ.. మమతా బెనర్జీ ప్రభుత్వంపై ధర్మాసనం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. విచారణ సందర్భంగా ట్రైనీ డాక్టర్‌ శవపరీక్షకు సంబంధించిన కీలక పత్రం మిస్‌ అయినట్లు కోర్టు దృష్టికి వచ్చింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శవపరీక్షకు సంబంధించి కీలక పత్రాలు కనిపించకుండాపోయిన ఘటనపై వివరణ ఇవ్వాలని బెంగాల్ సర్కార్‌కు ఆదేశాలు జారీ చేసింది.


కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌‌తోపాటు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పోస్టుమార్టం కోసం బాధితురాలి మృతదేహంతోపాటు ఆమె దుస్తులను కూడా పంపించారా అనే ప్రశ్న తలెత్తింది. ఈ క్రమంలోనే స్పందించిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్.. పోస్ట్‌మార్టం కోసం అవసరమైన కీలక పత్రాల గురించి ఆరా తీశారు. శవపరీక్ష కోసం మృతదేహంతో పాటు ఏమేమి పంపించారో అనేది సంబంధిత చలాన్‌లోని కాలమ్‌లో సదరు కానిస్టేబుల్‌ నింపాల్సి ఉంటుందని తెలిపారు. ఆ పత్రం లేకుండా శవపరీక్ష నిర్వహించలేరని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్‌ను ఉద్దేశించి సీజేఐ అన్నారు.


కానీ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పోస్ట్‌మార్టం నివేదికలో ఈ చలాన్‌ గురించి ఎలాంటి ప్రస్తావన లేదని ధర్మాసనం గుర్తించింది. ఒకవేళ అది కనిపించకుండా పోతే అలా ఎందుకు జరిగిందో అనేది మంగళవారంలోగా వివరణ ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వ తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌‌ను కోర్టు ఆదేశించింది. దీనిపై స్పందించిన కపిల్ సిబల్.. ఆ చలాన్‌ను కోర్టుకు సమర్పిస్తామని.. అయితే దానికి కొంత సమయం కావాలని కోరారు.


మరోవైపు.. బాధితురాలు మృతి చెందిన 14 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపైనా సుప్రీంకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. ఘటన జరిగిన తర్వాత అంత ఆలస్యంగా ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారని ప్రశ్నించింది. ఈ కేసు దర్యాప్తు పురోగతిపై నివేదికను సెప్టెంబర్ 17వ తేదీ లోగా సమర్పించాలని సీబీఐకి సుప్రీంకోర్టు సూచించింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బాధితురాలి ఫొటోలను తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com