ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కమలా హారిస్ ప్రచారంలో "నాటు నాటు" పాట

international |  Suryaa Desk  | Published : Mon, Sep 09, 2024, 09:35 PM

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నవంబర్ 5వ తేదీన జరగనున్న అగ్రరాజ్య ఎన్నికలపైనే ప్రపంచ దేశాల దృష్టి ఉంది. ఇక ప్రస్తుతం అమెరికాలో అధికారంలో ఉన్న డెమోక్రాటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హారిస్ పోటీ చేస్తున్నారు. ఇక అమెరికాలో భారత సంతతికి చెందిన వారు లక్షల్లో ఉండగా.. వారిని తమవైపు తిప్పుకోవడమే లక్ష్యంగా డెమోక్రాటిక్ పార్టీ, కమలా హారిస్ పావులు కదుపుతున్నారు. మరోవైపు.. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన వారి ఓట్లే లక్ష్యంగా వారికి గాలం వేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు ధీటుగా కమలా హారిస్ అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు.


ఈ క్రమంలోనే కమలా హారిస్.. భారతీయ ఓటర్లే లక్ష్యంగా కీలక వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. విశ్వవేదికపై భారత్‌కు ఆస్కార్ అవార్డు తెచ్చిపెట్టిన నాటు నాటు పాటను బాగా ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే భారత అమెరికన్ నేత అయిన అజయ్ భుటోరియా.. నాటు నాటు పాటకు హిందీ వెర్షన్ అయిన నాచో నాచో పాటను కమలా హారిస్‌కు లింక్ చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా కమలా హారిస్ వీడియోలకు ఈ నాచో నాచో పాటను జోడించి.. వీడియోను రూపొందించారు. తాజాగా ఆ వీడియోను అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బాగా వాడుకుంటున్నారు.


ఈ సందర్భంగా పాటను విడుదల చేసిన అజయ్ భుటోరియా.. నాచో నాచో కేవలం పాట మాత్రమే కాదని.. అది ఒక ఉద్యమం అని పేర్కొన్నారు. దక్షిణాసియా అమెరికన్ కమ్యూనిటీతో అనుసంధానం కావడమే తమ ప్రచారం అంతిమ లక్ష్యమని చెప్పారు. 44 లక్షల మంది ఇండియన్ అమెరికన్ ఓటర్లు.. 60 లక్షల మంది దక్షిణాసియా ఓటర్లు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హులు అని పేర్కొన్న అజయ్ భుటోరియా.. కమలా హారిస్‌ గెలుపు కోసం వారి ఓట్లను కూడగట్టడమే తమ లక్ష్యమని వెల్లడించారు. అమెరికా చరిత్రలోనే తొలిసారి 2020లో దక్షిణాసియా, ఆఫ్రికన్ అమెరికన్ సంతతికి చెందిన మహిళను ఉపాధ్యక్షురాలిగా ఎన్నుకుని చరిత్ర సృష్టించినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు ఆమెను అధ్యక్షురాలిగా ఎన్నుకునే సమయం వచ్చిందని అజయ్ భుటోరియా పేర్కొన్నారు.


ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికలో కమలా హారిస్ గెలిస్తే.. 248 ఏళ్ల అమెరికా చరిత్రలో అధ్యక్ష పీఠంపై కూర్చునే తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టిస్తారని అజయ్ భుటోరియా తెలిపారు. ఇక సెప్టెంబర్ 10వ తేదీన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ మధ్య తొలి డిబేట్ జరగనుందని తెలిపారు. ఈ క్రమంలో విడుదలైన సర్వేల్లో అధ్యక్ష పోరులో ఇద్దరి మధ్య హోరాహోరీగా పోటీ సాగనుందని తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com