ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పట్టాలపై గ్యాస్‌ సిలిండర్‌ పెట్టి భారీ కుట్ర.. త్రుటిలో కాళింది ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం!

national |  Suryaa Desk  | Published : Mon, Sep 09, 2024, 09:31 PM

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పుర్‌ సమీపంలో భారీ రైలు ప్రమాదానికి దుండగులు కుట్ర చేశారు. గ్యాస్ సిలిండర్ పెట్టి రైలును పట్టాలు తప్పించేందుకు ప్రయత్నించారు. అయితే, ప్రయాగ్‌రాజ్ భివానీ కాళింది ఎక్స్‌ప్రెస్‌‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాగ్‌రాజ్‌ నుంచి బయలుదేరిన రైలు.. ఆదివారం రాత్రి 8.20 గంటల శివరాజ్‌పుర్‌ ప్రాంతంలో పట్టాలపై ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ను ఢీకొట్టింది. ట్రాక్‌పై ఏదో అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు గుర్తించిన లోకో-పైలట్‌.. ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును నిలిపివేశారు. అప్పటికే ఆ సిలిండర్‌ను రైలు ఢీకొనడంతో అది పట్టాలకు దాదాపు 50 మీటర్ల దూరంలో ఎగిరిపడింది. అయితే, అదృష్టవశాత్తూ దానివల్ల రైలుకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.


ఈ విషయం గురించి రైల్వే గార్డుకు లోకో పైలట్‌ సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, ఫోరెన్సిక్‌ బృందం దర్యాప్తు చేపట్టింది. అక్కడ ధ్వంసమైన సిలిండర్‌తో పాటు ఒక పెట్రోల్‌ బాటిల్‌, అగ్గిపెట్ట, బ్యాగు సహా ఇతర అనుమానిత వస్తువులను కూడా పోలీసులు గుర్తించారు. రైలును పట్టాలు తప్పించేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ట్రాక్‌పై పెట్టినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు. నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు తెలిపారు.


పెట్రోలు బాంబుతో విధ్వంసానికి కుట్ర చేసినట్టు అక్కడ పరిస్థితి ఉందని చెప్పారు. ఈ ఘటనతో రైలు దాదాపు అరగంట పాటు నిలిచిపోయింది. అనంతరం గమ్యస్థానానికి బయల్దేరింది. కాన్పూర్ పోలీస్ కమిషనర్ హరీశ్ చంద్ర మాట్లాడుతూ.. ఫోరెన్సిక్ దర్యాప్తు మొదలుపెట్టిందని చెప్పారు. అత్యంత కీలకమైన మార్గాల్లో రైల్వేలు, సెక్యూరిటీ ఏజెన్సీలు భద్రతను కట్టుదిట్టం చేశాయని అన్నారు. ఘటనా స్థలిలో డాగ్ స్క్యాడ్‌తోనూ తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు. ఈ ఘటనతో అప్రమత్తమైన రైల్వే అధికారులు.. అవార్‌గంజ్-కసగంజ్ మార్గంలో ఆర్పీఎఫ్ సిబ్బందిని నియమించారు. గతంలో కూడా ఇటువంటి ఘటన చోటుచేసుకుంది. యూపీలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు వెళ్లే మార్గంలు నిందితులు పట్టాలపై రాళ్లను పేర్చిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com