ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాణసంచా తయారీ, అమ్మకాలపై నిషేధం

national |  Suryaa Desk  | Published : Mon, Sep 09, 2024, 09:27 PM

పండగ వచ్చిందంటే చాలు.. ఇంటి ముందు టపాసులు పేలాల్సిందే. ఇక దీపావళి అంటేనే బాణసంచా పండగ. నెల రోజుల పాటు టపాసుల మోతతో మొత్తం దేశమే ఊగిపోతూ ఉంటుంది. అయితే ఈ బాణసంచా పేల్చడం వల్ల.. వాతావరణ కాలుష్యం పెరిగిపోతూ ఉంటుందని అందుకే వాటిపై నిషేధం విధించాలని పర్యావరణ ప్రేమికులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తూనే ఉన్నారు. బాణసంచా కారణంగా గాలి మొత్తం కాలుష్యం ఏర్పడి.. ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రమాదకరమని చెబుతూనే ఉంటారు. ఇక చలికాలంలో ఈ గాలి కాలుష్యం కారణంగా పొగమంచు పేరుకుపోవడం.. మధ్యాహ్నం అయినా రోడ్లపై కాలుష్యం నిండిపోయి ఉండటం మనం చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలోనే తాజాగా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బాణసంచా తయారీ, విక్రయాలపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది.


దేశ రాజధాని ఢిల్లీలో ఏటికేడు పెరిగిపోతున్న వాయు కాలుష్యం కారణంగా ఈసారి చలికాలం రాకముందు నుంచే అక్కడ అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే మొట్టమొదట టపాసులపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. బాణసంచా తయారు చేయడం, వాటిని విక్రయించడంపై నిషేధం విధిస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆప్ సర్కార్ స్పష్టం చేసింది.


దుకాణాలు మాత్రమే కాకుండా ఆన్‌లైన్‌లోనూ టపాసుల విక్రయ డెలివరీలపైనా ఈ నిషేధం వర్తిస్తుందని గోపాల్ రాయ్ తేల్చి చెప్పారు. రాబోయే శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. బాణసంచా తయారీ, అమ్మకాలపై విధించిన నిషేధం 2025 జనవరి 1వ తేదీ వరకు అమలులో ఉంటుందని తెలిపారు. ఇక టపాసుల తయారీ, విక్రయంపై విధించిన నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని అధికారులను మంత్రి గోపాల్ రాయ్ ఆదేశించారు. ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయం చేసుకుని సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. ఢిల్లీ నగర వ్యాప్తంగా వాయు కాలుష్యాన్ని నియంత్రించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించుకున్న 21 ఫోకస్‌ పాయింట్ల ఆధారంగా శీతాకాల కార్యాచరణ ప్రణాళికలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com