ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదు.. ప్రకటించిన కేంద్రం

national |  Suryaa Desk  | Published : Mon, Sep 09, 2024, 09:25 PM

2020లో వెలుగు చూసిన కరోనా మహమ్మారి.. ప్రపంచ దేశాలను ఇప్పటికీ భయపెడుతుండగా.. తాజాగా మరో వైరస్ మానవాళిని తీవ్రంగా వణికిస్తోంది. ఆఫ్రికా, యూరప్ దేశాల్లో వ్యాప్తి చెందుతున్న మంకీపాక్స్ వైరస్.. ఇప్పుడు భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. భారత్‌లో మొదటి ఎంపాక్స్ కేసు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటించింది. ఇటీవల మంకీపాక్స్ వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలినట్లు వెల్లడించింది. గతంలో భారత్‌లో నమోదైన మంకీపాక్స్ వైరస్ వేరియంట్ కంటే ఈసారి సోకిన వేరియంట్ అంత ప్రమాదకరం కాదని.. దీంతో అంతగా భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.


దేశంలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైనట్లు కేంద్రం ట్విటర్‌లో ఒక పోస్ట్ చేసింది. ఢిల్లీలో ఒకరికి మంకీపాక్స్ వైరస్‌ను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. అయితే ఆ వ్యక్తి ఇటీవలె ఆఫ్రికన్ దేశం నుంచి భారత్‌కు రాగా.. అతడిలో మంకీపాక్స్ తరహా లక్షణాలు కనిపించాయి. దీంతో అతడ్ని ఐసోలేషన్‌కు తరలించిన అధికారులు.. రక్త నమూనాలు తీసుకుని ల్యాబ్‌కు పంపించి పరీక్షలు నిర్వహించారు. తాజాగా ఆ ఫలితాల్లో అతడికి ఎంపాక్స్ సోకినట్లు తెలిపారు. బాధితుడికి వెస్ట్ ఆఫ్రికన్ క్లాడ్ 2 ఎంపాక్స్ వైరస్ ఉన్నట్లు గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే ఈ ఏడాది దేశంలో ఇప్పటివరకు ఒకటే మంకీపాక్స్ కేసు నమోదైందని తెలిపింది.


ఇక భారత్‌లో తొలిసారి 2022లో 30కిపైగా మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం నమోదైన వెస్ట్ ఆఫ్రికన్ క్లాడ్ 2 ఎంపాక్స్ వైరస్ రకం.. 2022లో నమోదైన కేసుల అంత ప్రమాదకారి కాదని తేల్చి చెప్పారు. దీంతో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఎంపాక్స్ క్లాడ్ 1 ఆరోగ్య అత్యవసర స్థితికి సంబంధించిన వైరస్ కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది. అయితే ఇప్పుడు వైరస్ సోకిన వ్యక్తి మంకీపాక్స్ కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న దేశం నుంచి ఇటీవల భారత్‌కు వచ్చినట్లు తెలిపింది. ప్రస్తుతం అతడిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని.. ఆరోగ్య సమస్యలు ఏమీ లేవని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది.


మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా ఎంపాక్స్ కేసులు పెరుగుతున్న కొద్దీ కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం.. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైరల్ లక్షణాలు ఉన్నాయని అనుమానం వచ్చిన వ్యక్తులందరికీ స్క్రీనింగ్, టెస్టింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్‌ చేయాలని కేంద్రం సూచించింది. బాధితులకు చికిత్స అందించేందుకు ఐసోలేషన్ కేంద్రాలను సిద్ధం చేయడానికి ఆస్పత్రులను గుర్తించాలని రాష్ట్రాలను కోరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన వివరాల ప్రకారం.. 2022 జనవరి నుంచి 2024 ఆగస్టు మధ్య.. ప్రపంచంలోనే 120 దేశాల్లో మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి. మొత్తం లక్షకుపైగా కేసులు నమోదుకాగా.. 220 మరణాలు సంభవించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com