ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్మీ జనరల్ తాగిన కాస్ట్లీ టీకి దేశం మొత్తం మూల్యం చెల్లించుకుంటోంది

international |  Suryaa Desk  | Published : Mon, Sep 09, 2024, 09:37 PM

అఫ్గనిస్థాన్‌ నుంచి అమెరికా, నాటో బలగాలు వైదొలగిన తర్వాత తాలిబన్ల ఏలుబడిలోకి రాగానే అక్కడికి వెళ్లి పాకిస్థాన్‌కు చెందిన ఓ సైనిక జనరల్‌ చేసిన తప్పునకు ఇప్పుడు దాయాది భారీ మూల్యం చెల్లించుకుంటోదట. ఈ విషయాన్ని స్వయంగా పాక్ ఉప-ప్రధాని, విదేశాంగ మంత్రి ఇసాక్‌ దార్‌ వెల్లడించారు. శనివారం లండన్‌‌లోని పాక్ హైకమిషన్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అమెరికా మద్దతుతో కొనసాగుతోన్న అష్రాఫ్ ఘనీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తాలిబన్లకు మద్దతుగా కొందరు ఉగ్రవాదులను నాటి ప్రభుత్వం విడుదల చేసిందని ఆరోపించారు. ఆ మిలిటెంట్లే ఇప్పుడు బలూచిస్థాన్‌లో ఉగ్రవాదానికి మాస్టర్‌మైండ్లుగా మారారని దార్ ఆందోళన వ్యక్తం చేశారు.


‘ఆ కప్పు టీకి దేశం మొత్తం మూల్యం చెల్లిస్తోంది’ అని పాక్ పత్రిక డాన్‌ కథనాన్ని ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. ఇటీవల బలూచ్ ప్రావిన్సుల్లో జరిగిన ఉగ్రదాడుల్లో మొత్తం 14 మంది సైనికులు సహా 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో పాక్ విదేశాంగ మంత్రి దార్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. జనరల్ హమీద్‌ కాబూల్‌ పర్యటనకు నాటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అనుమతి ఇచ్చారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఇమ్రాన్‌ ఖాన్‌ అనుమతి లేకుండా ఆయన అక్కడకు వెళ్లారని నేను అనుకోను.. ఎందుకంటే ప్రధాని అనుమతి లేకుండా ఇలాంటివి జరగవు.సెక్యూరిటీ ఏజెన్సీలతో కలిసి మేం ఈ అంశంపై పనిచేయాలి’ అని ఆయన అన్నారు.


గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ముఖ్యంగా ఆర్దిక, భద్రతా పరమైన నిర్ణయాలు దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేశాయని దార్ అన్నారు. ఇమ్రాన్ సర్కారు, సైనిక అధికారులు చేసిన పనికి దేశ భవిష్యత్తుకు ముప్పు వాటిల్లిందని వ్యాఖ్యానించారు. ఇక, 2021 ఆగస్టులో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత.. ఐఎస్‌ఐ చీఫ్‌ ఫయాజ్‌ హమీద్‌ కాబూల్‌‌ను సందర్శించారు. ఆ సందర్భంగా తాలిబన్ల ఆతిథ్యం స్వీకరిస్తూ ఓ టీకప్పుతో ఆయన దిగిన ఫొటో అప్పట్లో సంచలనంగా మారింది. తాజాగా, ఆయన కాబూల్ పర్యటనపై దార్ విమర్శలు గుప్పించారు. ఇటీవలే ఓ కేసులో ఐఎస్ఐ మాజీ చీఫ్ ఫయాజ్‌ హమీద్‌ను పాక్‌ సైన్యం అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయనపై కోర్టు మార్షల్ జరుగుతోంది.


ఇక, బలూచిస్థాన్‌‌లో వేర్పాటువాదం దాయాదిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత మూడేళ్లలో తెహ్రీక్‌ ఈ తాలిబన్‌, బలోచ్‌ మిలిటెంట్‌ సంస్థలు చేస్తోన్న దాడులతో బలూచ్ ప్రావిన్సుల్లో పరిస్థితి భయానకంగా మారింది. ఈ దాడులతో దాదాపు 60 బిలియన్‌ డాలర్ల వ్యయంతో నిర్మించిన చైనా-పాక్ ఎకనామిక్‌ కారిడార్‌ ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. ఈ ప్రాజెక్ట్‌ను బలూచిస్థాన్ వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com