ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సొంత మనుషుల్లా చూసుకుంటాం: పీవోకే ప్రజలకు రాజ్‌నాథ్ పిలుపు

national |  Suryaa Desk  | Published : Mon, Sep 09, 2024, 09:34 PM

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లోని ప్రజలు భారత్‌లో కలవాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. వారిని విదేశీయులుగా పాకిస్థాన్‌ చూస్తున్నా.. తాము మాత్రం సొంత మనుషుల్లా చూసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. జమ్మూ కశ్మీర్‌లోని రాంబన్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాజ్‌నాథ్ సింగ్.. తాము పాకిస్థాన్‌‌తో మెరుగైన సంబంధాలనే కోరుకుంటున్నామని ఉద్ఘాటించారు. అయితే, చర్చలు జరగాలంటే ఉగ్రవాదాన్ని పాక్ విడనాడాల్సిందేనని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఎన్నో మార్పులు సంతరించుకున్నాయని అన్నారు.


 ‘‘జమ్మూ కశ్మీర్‌లో బీజేపీకి అధికారం కట్టబెడితే స్థానికంగా మరిన్ని అభివృద్ధి పనులు చేపడతాం.. తమకు పాకిస్థాన్‌తో ఉండటం ఇష్టం దని, భారత్‌కు వెళ్తామని పీవోకేలోని ప్రజలూ చెప్పేంత స్థాయిలో ఆ అభివృద్ధి ఉంటుంది.. పీవోకేను ఓ విదేశీ భూభాగంగా చూస్తోందన్న విషయాన్ని పాకిస్థాన్ అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కూడా ఇటీవల ఓ అఫిడ్‌విట్‌లో పేర్కొన్నారు’’ అని ఆయన చెప్పారు. పీఓకేకు చెందిన జర్నలిస్టు అహ్మద్ ఫర్హాద్ షా కిడ్నాప్ కేసులో ఇటీవల పాక్ ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన అఫిడ్‌విట్‌లో.. పాక్ ఆక్రమిత కశ్మీర్ విదేశీ భూభాగమేనని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని రాజ్‌నాథ్ తన ప్రసంగంలో ప్రస్తావించారు.


ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌లో భద్రతపరంగా ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయని రాజ్‌నాథ్‌ అన్నారు. ఒకప్పుడు తుపాకులు, మారణాయుధాలతో తిరిగిన యువత చేతుల్లో ఇప్పుడు లాప్‌టాప్‌లు, కంప్యూటర్లు ఉంటున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజలపై బుల్లెట్లను కురిపించే సాహసాన్ని ఇప్పుడు శ్రీనగర్‌లో ఎవరూ చేయడం లేదని పేర్కొన్నారు. అయితే, ఈ ఆర్టికల్‌ను పునరుద్ధరిస్తామని నేషనల్‌ కాన్ఫరెన్స్‌-కాంగ్రెస్‌ కూటమి ఇచ్చిన హామీని తప్పుబట్టారు. బీజేపీ ఉన్నంతవరకు అది సాధ్యం కాదని రాజ్‌నాథ్ తేల్చిచెప్పారు.


అలాగే, పాకిస్థాన్‌తో సంబంధాలు మెరుగుపడాలనే భారత్‌ కోరుకుంటుందన్న రాజ్‌నాథ్ సింగ్.. చర్చలు జరగాలంటే మొదట ఉగ్రవాదానికి ఊతమివ్వడాన్ని ఆ దేశం మానుకోవాలని పునరుద్ఘాటించారు. బనిహాల్‌లో జరిగిన ఎన్నికల సభలోనూ కేంద్ర మంత్రి ప్రసంగించారు. స్నేహితుడ్ని మార్చుకోవచ్చు గానీ పొరుగువారిని మార్చుకోలేమన్న వాస్తవం తమకు తెలుసునని పేర్కొన్నారు. కశ్మీర్‌ ఉగ్రవాద ఘటనల్లో ప్రాణాలు కోల్పోయినవారిలో 85% మంది ముస్లింలేనని ఆయన తెలిపారు. కశ్మీర్‌లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 90 స్థానాలున్న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి మూడు దశల్లో (సెప్టెంబరు 18, 28, అక్టోబరు 1) పోలింగ్ నిర్వహించి, అక్టోబరు 8న ఫలితాలను వెల్లడిస్తారు. ఈ ఎన్నికల్లో ఎన్సీ-కాంగ్రెస్ కూటమిగా పోటీచేస్తుంటే.. బీజేపీ, పీడీపీలు ఒంటరిగా బరిలో నిలిచాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com