ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో మంకీపాక్స్ అనుమానిత కేసు.. అన్ని రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

national |  Suryaa Desk  | Published : Mon, Sep 09, 2024, 09:30 PM

ప్రస్తుతం ప్రపంచ దేశాలను మంకీపాక్స్ లేదా ఎంపాక్స్ వైరస్ వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజుల నుంచే ఈ మంకీపాక్స్‌ వైరస్‌పై అలర్ట్ అవుతూ వచ్చిన కేంద్రం.. ఇటీవల ఓ వ్యక్తిలో వైరల్ లక్షణాలు కనిపించడంతో మరింత అప్రమత్తం అయింది. ఈ ఎంపాక్స్ వైరస్‌ను కట్టడి చేయడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. వైరస్ అనుమానితులకు టెస్ట్‌లు చేయాలని.. వారితో కాంటాక్ట్ ఉన్నవారి లిస్ట్‌ను కూడా రూపొందించాలని.. సోమవారం అడ్వైజరీ జారీ చేసింది.


ఇటీవల ఆఫ్రికన్ దేశం నుంచి వచ్చిన ఒక యువకుడిలో మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు వెలుగు చూడటంతో అలర్ట్ అయిన కేంద్రం.. అతడిని ఐసోలేషన్‌కు తరలించారు. ఈ క్రమంలోనే భారత్‌లో మంకీపాక్స్‌ లక్షణాలు ఉన్న అనుమానిత కేసు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. మంకీపాక్స్ వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక సూచనలు చేసింది. ఇక ఆ మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు ఉన్న ఆ వ్యక్తికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.


ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతుండగా.. అది ఆఫ్రికా దేశాలు మాత్రం తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ఈ ప్రాణాంతక ఎంపాక్స్‌ అనుమానిత కేసు భారత్‌లో వెలుగు చూడడం పెను సంచలనంగా మారింది. ఆఫ్రికన్‌ దేశం నుంచి వచ్చిన ఒక యువకుడిలో ఎంపాక్స్ లక్షణాలు కనిపించడంతో వెంటనే అతడిని ఐసోలేషన్‌కు తరలించి.. పరీక్షలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఎంపాక్స్ వ్యాప్తికి గల మూలాలను గుర్తించేందుకు కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ కొనసాగుతున్నట్లు చెప్పారు. ఎంపాక్స్‌కు సంబంధించి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.


ఇక ఎంపాక్స్ అనుమానితులందరికీ స్క్రీనింగ్, టెస్టింగ్ చేయాలని.. ఒకవేళ పాజిటివ్ వస్తే వారిని ఐసోలేషన్‌లో ఉంచాలని సూచించింది. అంతేకాకుండా ఎంపాక్స్ కారణంగా కేసులు, మృతులు తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అదే సమయంలో ప్రజల్లో మంకీపాక్స్ గురించి అనవసరమైన భయాందోళనలను నివారించడం చాలా ముఖ్యమని పేర్కొంది. ఆస్పత్రులను గుర్తించి అందులో ఐసోలేషన్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని.. వనరులను పెంపొందించుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విజ్ఞప్తి చేసింది.


గతంలో కొవిడ్ మహమ్మారి సోకినపుడు ఎలాంటి చర్యలు చేపట్టారో ఇప్పుడు కూడా అదే వ్యూహం అనుసరించాలని కేంద్రం సూచించింది. అనుమానిత కేసులను ట్రాక్ చేయడం, వాటి కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం చర్యలు చేపట్టాలని పేర్కొంది. టెస్టింగ్, క్లినికల్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్, ఇన్‌ఫెక్షన్ నివారణ, రిస్క్ కమ్యూనికేషన్ స్ట్రాటజీలను చేపట్టాలని కేంద్రం తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2022 జనవరి నుంచి 2024 ఆగస్ట్ వరకు ప్రపంచంలోని 120 దేశాల్లో ఈ మంకీపాక్స్ నిర్ధారణ అయింది. ఇప్పటివరకు లక్ష మందికి ఈ ఎంపాక్స్ వైరస్ సోకగా.. 220 మంది ప్రాణాలు కోల్పోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com