న్యూఢిల్లీ: ఆహార తయారీ(ఫుడ్ ప్రాసెసింగ్) ప్రక్రియలో రైతులే కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇవాళ ఆయన ఢిల్లీలో జరిగిన వరల్డ్ ఫుడ్ ఇండియా కార్యక్రమంలో మాట్లాడారు. రైతులను మనం అన్నదాతలు అని గౌరవిస్తామని, వాళ్లు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో చాలా ముఖ్యమైనవారని మోదీ అన్నారు. ప్రతి రోజూ లక్షల మంది ప్రయాణికులు రైళ్లల్లో వెళ్తుంటారని, ఆహార పరిశ్రమకు వాళ్లే ప్రధాన కస్టమర్లు అని ప్రధాని మోదీ తెలిపారు. ఫెర్మెన్టేషన్ లాంటి ఇంటి చిటకాల వల్ల ఆహార పరిశ్రమలో ఎన్నో మార్పులు వచ్చాయని, పచ్చళ్లు, పాపడాలు, చెట్నీలు లాంటివన్నీ చిన్న చిన్న టెక్నిక్లతో తయారు చేసినవే అన్నారు. పంట చేతికి వచ్చిన తర్వాత నిర్వహించే పోస్ట్ హార్వెస్ట మేనేజ్మెంట్ కూడా కీలకమన్నారు. ప్రైమరీ ప్రాసెసింగ్, స్టోరేజ్, ప్రిజర్వేషన్, కోల్డ్ చైన్, రిఫ్రిజిరేటెడ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా అవకాశాలను కల్పిస్తుందన్నారు. ప్రపంచ స్థాయి ఆహార పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజనా పథకాన్ని ప్రారంభించిందన్నారు.