ఆహార పరిశ్రమల కోసం సుమారు అయిదు బిలియన్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయన చెప్పారు. దీని వల్ల సుమారు 20 లక్షల మంది రైతులకు లాభం చేకూరుతుందన్నారు. అంతేకాకుండా సుమారు అయిదు లక్షల ఉద్యోగాలు కూడా కలుగుతాయన్నారు. పోషణ భద్రతకు ఫుడ్ ప్రాసెసింగ్ అనేక పరిష్కారాలను సూచిస్తుందన్నారు. మనం పండించే పప్పు దినుసుల్లో చాలా పోషకాలు ఉన్నాయని, వాటిని పండించడం వల్ల రైతుల ఆదాయం పెరుగుతందని, దేశవ్యాప్తంగా న్యూట్రీషన్ లెవల్స్ కూడా పెరుగుతాయని మోదీ తెలిపారు. వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భారత్ 30 ర్యాంక్లు ఎగబాకిందని, ప్రపంచంలో ఇప్పుడు భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని మోదీ అన్నారు. జీఎస్టీ వల్ల రకరకాల పన్నుల నుంచి విముక్తి లభించిందన్నారు.