చాలా దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. చర్యలు తీసుకోవాలంటూ కేంద్రం రాష్ట్రాలకు అలెర్ట్ చేసింది. కాగా ఇప్పటికే వేవ్లు, వేరియంట్లతో కరోనా వైరస్ కరాళనృత్యం చేసింది. లక్షలాది మందిని బలి తీసుకుంది. కొన్ని వారాల నుంచి ప్రపంచ వ్యాప్తంగా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ, చైనా సహా ఆగ్నేయ ఆసియా, ఐరోపాలోని కొన్ని దేశాల్లో కొన్ని రోజులుగా కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో భారత్లోనూ నాలుగో వేవ్ వచ్చే అవకాశాలున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దంటూ రాష్ట్రాలను హెచ్చరించింది. ప్రజలంతా నిబంధనలు పాటించేలా చూడాలని, టెస్టులు పెంచాలని సూచించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, వైరస్ వ్యాప్తిని అరికట్టే ఐదు అంచెల వ్యూహమైన టెస్ట్, ట్రాక్, ట్రీట్, కొవిడ్ నిబంధనలు, వ్యాక్సినేషన్పై దృష్టి సారించాలని రాజేశ్ భూషణ్ స్పష్టం చేశారు.