అసోంలో రాబందులు మృత్యువాతపడటం కలకలం రేపుతోంది. కమ్రూప్ జిల్లాలోని ఛయ్గావ్ ప్రాంతంలో దాదాపు వంద రాబందులు చనిపోయాయి. ఇంకొన్ని ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయి. మిలన్పూర్ ప్రాంతంలో రాష్ట్ర అటవీ శాఖ అధికారులు సుమారు వంద రాబందుల కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు. ఒకేసారి ఇన్ని రాబందులు చనిపోవడం ఇదే మొదటిసారని కమ్రూప్ వెస్ట్ ఫారెస్ట్ డివిజన్కు చెందిన జిల్లా అటవీ అధికారి డింపి బోరా చెబుతున్నారు. రాబందులు చనిపోయిన గొర్రె కళేబరాన్ని తిన్నాయని, అందుకే అవి చనిపోయాయని అనుమానిస్తున్నారు అటవీశాఖ అధికారులు. ఆ మాంసం విషపూరితంగా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే రాబందుల మృతికి కచ్చితమైన కారణం పోస్టుమార్టం నివేదికలో వెల్లడి కానుంది. రాబందుల కళేబరాల దగ్గర గొర్రె ఎముకలు కొన్ని దొరికాయని, విషపూరితమైన గొర్రె కళేబరాన్ని తిని రాబందులు చనిపోయాయని అనుమానంగా ఉందన్నారు అధికారులు. పోస్టుమార్టం నివేదికలో మరణానికి గల కచ్చితమైన కారణాలు తెలుస్తాయని చెప్పారు. ఒక వేళ గొర్రె కళేబరంలో ఎవరైనా విషం కలిపితే, అది పెద్ద నేరం అని ఆఫీసర్లు అంటున్నారు.