ముంబయి: భారతీయ రిజర్వు బ్యాంకు కొత్త రూ. 1000 నోట్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోందట. ఇప్పటికే వీటి ముద్రణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. కొత్త రూ. 1000 నోట్లను జనవరిలోనే ప్రవేశపెట్టాలని రిజర్వు బ్యాంకు భావించిందని, కానీ రూ. 500 నోట్లను అత్యవసరంగా ముద్రించాల్సి ఉండటంతో ఈ ప్రక్రియ వెనుకపడిందని అధికార వర్గాలు తెలిపాయి. రూ. 2000ల నోటుకి చిల్లర ఇబ్బందులను అధిగమించడానికి రూ. 1000 నోట్లను ప్రవేశపెడుతున్నట్లు చెప్తున్నారు.
రూ. 2000, రూ.500 నోట్లతో సహా అన్ని రకాల డినామినేషన్ల నోట్లు కలిపి జనవరి 27 నాటికి 9.92 లక్షల కోట్ల నగదు చలామణీలో ఉందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్. గాంధీ ఫిబ్రవరి 8న తెలిపారు. విడివిడిగా రూ. 500, రూ. 2000 నోట్లు ఎన్ని చలామణీలో ఉన్నాయో ఆర్బీఐ తెలపలేదు. నోట్ల రద్దు నేపథ్యంలో తలెత్తిన నగదు కొరత కారణంగా ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొనడమే కాక, ఆర్బీఐ సైతం నగదు ఉపసంహరణ మీద పలు రకాల నిబంధనలు విధించాల్సి వచ్చింది. రూ. 500 కన్నా ముందు రూ. 2000 నోటు అందుబాటులోకి రావడం, దానికి చిల్లర దొరక్క ప్రజలు ఇబ్బంది పడడం లాంటివి జరిగిన నేపథ్యంలో తాజాగా ఇప్పుడు మళ్లీ కొత్త వెయ్యినోటు తేవడం పట్ల రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.