రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నప్పుడు మీటర్లు కొని అమర్చడం ఎందుకని, రైతులందరూ వ్యతిరేకిస్తున్న బలవంతంగా మీటర్లు బిగించే ప్రక్రియ అమలుకు ప్రభుత్వం పూనుకోవడంలో అంతర్యం ఏమిటని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు,ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు మీటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం వ్యతిరేకిస్తుందని, పశ్చిమగోదావరి జిల్లాలో రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న ప్రభుత్వం ఎందుకు బలవంతంగా అమలు చేస్తుందని ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వానికి ఒక ప్రకటన విడుదల చేశారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల వల్ల రైతులకు మేలు కలిగితే రైతులు ఎందుకు వ్యతిరేకిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నగదు బదిలీ పథకానికి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నా రైతులు ఎందుకు ముందుకు రావడం లేదని...?.... రైతులకు అనుకూలంగా ఉంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ...రైతులందరూ ఆమోదయోగ్యంగా ఉన్నారని గొప్పలు చెబుతున్న ప్రభుత్వ పెద్దలు ఈ ఈ విషయంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి రీడింగ్ తీయడం, ఉచిత విద్యుత్ కు మంగళం పాడటమేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రైతులపై ప్రేమ ఉంటే ఉచిత విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం నగదు బదిలీ చేయడం ఎందుకని ప్రశ్నించారు. మోటార్లకు మీటర్లు బిగించడం వల్ల ప్రభుత్వానికి కోట్ల ఆర్థికభారమని, మీటర్ల కొనుగోలు వల్ల ప్రైవేటు కంపెనీలకు లాభమని పేర్కొన్నారు. మీటర్లు అమర్చాడానికి ప్రైవేట్ కంపెనీలకు ప్రభుత్వం రూ.1,300 కోట్లు చెల్లించాలని, ఇది కాకుండా డిస్కామ్లకు మీటరు బాక్సులకు ఒక్కసారి వ్యయం, ఇతర నెలవారీ నిర్వహణ ఖర్చులు పెరుగుతాయని దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీ భారం పడుతుందన్నారు. మోటర్ లకు మీటర్లు బిగించడం వల్ల రూ.1500 కోట్లకు పైగా ఖర్చవుతుందన్నారు. నగదు బదిలీ ద్వారా ఉచిత విద్యుత్ అమలు జరుగుతుందని చెబుతున్న ప్రభుత్వానికి, ఇక మీటర్లతో పని ఏంటని ప్రశ్నించారు. వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రయత్నాలు విరమించాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. రైతులకు నష్టం కలిగే ఈ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రైతులకు ప్రయోజనం లేని ప్రైవేట్ కంపెనీలను లాభపరిచే మీటర్ల కొనుగోలు టెండర్ల ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులను సమీకరించి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రైతు సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వానికి రైతులపై భారాలు మోపే అధికారం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం వ్యవసాయం అనుబంధ సంస్థలను నిర్వీర్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సబ్సిడీ ద్వారా వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు , డ్రిప్ ఇరిగేషన్ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏ ఒక్క పథకం అమలుకు నోచుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందించే డ్రిప్ ఇరిగేషన్ ను సైతం ప్రభుత్వం పక్కకు పెట్టిందని దీంతో రైతుల పై ఆర్థిక భారం పడుతుందన్నారు. రైతు సంక్షేమమే తమ లక్ష్యం అని గొప్పలు చెబుతూ అన్నదాతలను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో జలాశయాలన్ని నిండు కుండలా ఉంటే మాగాణి భూములకు నీరు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. లక్షలాది ఎకరాలు బీడు భూములుగా మారాయని, ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పడం దురదృష్టకరమన్నారు. రైతు ప్రయోజనాలను దెబ్బతీసే ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదన్నారు.