రైల్వే స్టేషన్లోపల అరటి పండు అమ్మితే జైలుకు వెళ్లకతప్పదని హెచ్చరిస్తున్నారు యూపీలోని చార్బాగ్ రైల్వే అధికారులు . చార్బాగ్ రైల్వే స్టేషన్లో రోజూ లక్షలాది మంది ప్రయాణికులు వస్తూ, వెళ్తూ ఉంటారు. అయితే అక్కడ అరటి అమ్మకాల వల్ల వాటిని తిని అక్కడే పడేస్తున్నారు. దీంతో స్టేషన్లో ట్రాకులు, ఫ్లాట్ఫాం అపరిశుభ్రంగా మారిపోతున్నాయి. దీంతో వాటిని తీసేయడం తలకు మించిన భారంగా మారుతోంది. ఇక చేసేదేమిలేక అరటి అమ్మకాలను స్టేషన్ లోపల నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. స్టేషన్ లోపల అరటి పళ్లు అమ్మినా, వాటిని తిన్నా అరెస్టు చేయిస్తామంటున్నారు. ఎవరైనా కావాలంటే బయటికి వెళ్లి కొనుక్కొని తినాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.
ఈ నిర్ణయంపై వ్యాపారులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణాన్ని కలుషితం చేసే ప్లాస్టిక్ లాంటి పదార్థాలను లోపలికి అనుమతించినప్పుడు అరటి తొక్కలతో వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నిస్తున్నారు. పరిసరాలు శుభ్రంగా లేకపోతే సిబ్బందిని పెంచాలని లేదా ఎక్కడికక్కడ డస్ట్ బిన్లు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. అంతే కానీ అధికారులు అరటి పళ్లు లోపలికి తీసుకురావద్దని చెప్పడం మాత్రం ఏమాత్రం ఆమోదింపజేసేది కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.