విజయవాడ, మేజర్న్యూస్: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని నల్లమడ వాగు ఆధునికీకరణకు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు నియోజక వర్గ ప్రజాప్రతినిధులు, ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి రావెల కిశోర్బాబు ఆధ్వర్యంలో నియోజకవర్గ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచ్లు, రైతులు, ప్రజలు శుక్ర వారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. వందల సంవత్సరాల నుంచి నల్లమడవాగు వర్షాకాలంలో భారీ వర్షాలు వచ్చినప్పుడల్లా ముఖ్యంగా పెదనందిపాడు, కానుమాను మండలాల్లోని అనేక గ్రామాలు నీట మునగటం, పంట పొలాలు ఇసుక మేట వేసి పంటలకు పనికి రాకుండా పోవడం, పంట నష్టం జరగడం, పశుసంపద చనిపోవడం, ప్రాణనష్టం జరగడంవంటి తీవ్ర ఇబ్బందులను గురికావడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రజలు, పాలకులను ఎన్నో వేడుకుంటున్నప్పటికీ స్పందన కరువుయిందని చెప్పారు. గత ఏడాడి వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు నల్లమడ వాగు కట్టలు తెగి ఎంతో పంటనష్టం, పశువులు మరణించడం, ఆస్తినష్టంతో ఆ ప్రాంతంలో పర్యటించిన ముఖ్యమంత్రి సమస్య తీవ్రతను ఆర్థం చేసుకుని ఆధునీకరణకు సంబంధించి అధికారులను వెంటనే పనుల ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. ఈ నల్లమడ వాగు ఆధునీకరణకు మొత్తం రూ.324 కోట్ల ఖర్చు కానున్నదని అంచనా వేసి ఈ ఏడాది జనవరి 20న ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. అందులో మొదటి విడతగా సర్వే, ఇన్వెస్టిగేషన్తో పాటు భూసేకరణకు, ఇతరత్రా రూ.240 కోట్ల మంజూరు చేసినందుకు నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.