ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో వైద్యవిద్య మెరుగుదలకు కేంద్రం తోడ్పాటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 15, 2017, 12:43 AM

-క్లినికల్‌ కోర్సుల్లో అదనపు సీట్లకు కేంద్రం సమ్మతి
-నీట్‌ పరీక్షా కేంద్రాలు 5కు పెంపునకు విజ్ఞప్తి
-ఢిల్లీ పర్యటనలో ఏపీ వైద్య, ఆరోగ్య శాఖమంత్రి కామినేని  

విజయవాడ, మేజర్‌న్యూస్‌ : ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు ప్రభుత్వ వైద్య కళాశా లల్లో క్లినికల్‌ కోర్సుల్లో ఇప్పుడున్న  394 సీట్లకు అదనంగా మరో  380 సీట్లను పెంచాలని చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు రాష్ర్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ కామినేని శ్రీనివాస్‌ వెల్లడించారు. ఒక రోజు పర్యటన నిమిత్తం న్యూఢిల్లీకి వెళ్లిన ఆయన మంగళవారం నాడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జె.పి.నడ్డాతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ లోని తిరుపతి,కాకినాడ,విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కర్నూల్‌, కడప లో గల ఏడు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రస్తుతం క్లినికల్‌ కోర్సుల్లో 394 పీజీ సీట్లు అందుబాటులో వున్నాయి.  వీటికి అదనంగా తిరుపతి కళాశాలలో 61 సీట్లు, కాకినాడ కళాశాలలో 69 సీట్లు, విజయవాడ కళాశాలలో 28 సీట్లు, గుంటూరు కళాశాలలో 42 సీట్లు, విశాఖపట్నం కళాశాలలో 94 సీట్లు, కర్నూల్‌ కళాశాలలో 84 సీట్లు, కడప కళాశాలలో 16 సీట్లు పెంచాలని చేసిన విజ్ఞప్తికి అంగీకరించారని మంత్రి విలేకరుల సమావేశంలో వెల్లడించారు.  ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు నీట్‌ పీజీ 2017లో అర్హతా మార్కులు తగ్గించాలని, మినహాయింపులు కల్పించాలని చేసిన విజ్ఞప్తిపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కూడా నడ్డా చెప్పినట్లు కామినేని తెలిపారు. 2016 నీట్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామ్‌ విజయవాడ, విశాఖపట్నం సెంటర్లలోనే నిర్వహించారని, ఈ సంవత్సరం ఈరెండు సెంటర్లకు అదనంగా రాజమండ్రి, తిరుపతి, కర్నూల్‌ లో నిర్వహణకు  కూడా సెంటర్లు ఏర్పాటు చేయాలని నడ్డాను కోరినట్లు కామినేని వెల్లడించారు. మొత్తం 31 ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల్లో  4500 ఎంబీబీఎస్‌ సీట్లు, 1300 డెంటల్‌ సీట్లు వున్న ఆంధ్రప్రదేశ్‌ లో పరీక్ష సెంటర్లను విజయవాడ, విశాఖపట్నంలోనే కాకుండా రాజమండ్రి, తిరుపతి, కర్నూల్‌ లో కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని, నీట్‌  నిర్వహణ కోసం సిబిఎస్‌ఇ ఇప్పటికే ఆన్‌ లైన్‌ పద్ధతిలో దరఖాస్తుల విడుదల ను ప్రారంభించినందున వీలైనంత త్వరగా నిర్ణయాన్ని తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరినట్లు కామినేని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ లో కిడ్ని బాధితుల సమస్యల పరిష్కారం కోసం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని, ప్రత్యేకించి ఉద్ధానం ప్రాంతంలో 15 వైద్య బందాలు ఇప్పటికే వేలాదిమందికి పరీక్షలు నిర్వహించాయని, మరో నెల రోజుల్లో మొత్తం లక్ష మందికి పరీక్షల నిర్వహణ పూర్తి చేస్తామని, అవసరమైన మేరకు డయాలసిస్‌ సెంటర్లు ఏర్పాటు చేశామని మరిన్నిఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. ఉద్ధానంలో శాశ్వత నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇప్పటికే అక్కడున్న అందరికీ సురక్షిత మంచినీరు అందించడం, వ్యాధి బారిన పడ్డ వారికి అవసరమైన డైట్‌ , మందులు అందిస్తున్నామని, డయాలసిస్‌ సెంటర్లు ఏర్పాటు చేసి చికిత్స చేయిస్తున్నామని, రానున్న రోజుల్లో ఇంకా కొన్ని సెంటర్లు ఏర్పాటు చేయడమే కాకుండా , వ్యాధి కారణాలపై నివేదికలు వచ్చాక మరిన్ని చర్యలు చేపడతామని కామినేని విలేకరుల ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. రాజ్యసభ సభ్యులు టీ.జీ.వెంకటేష్‌ తో కలిసి   కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్‌ తో కూడా శ్రీ కామినేని శ్రీనివాస్‌ భేటీ అయ్యారు.2014లో గ్యాస్‌ పైప్‌ లైన్‌ పేలడం కారణంగా గ్యాస్‌ ఆధారిత విఘ్నేశ్వరం విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రానికి గ్యాస్‌ సరఫరాను నిలిపివేశారని, అయితే ప్రస్తుతం పైప్‌ లైన్‌ పునరుద్ధరణ జరిగినందున యధావిధిగా గ్యాస్‌ సరఫరాను కొనసాగించాలని కోరినట్లు  శ్రీనివాస్‌ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com