తిరుమల: శ్రీవారి ఆర్జితసేవల బుకింగ్ కోసం ఉద్దేశించిన టీటీడీ మొబైల్ యాప్ను ఉగాదికంతా సిద్ధం చేయాలని అధికారులను టీటీడీ ఈవో సాంబశివరావు ఆదేశించారు. చిత్తూరు జిల్లా తిరుమలోని అన్నమయ్య భవనంలో మంగళవారం ఆయన సీనియర్ అధికారులతో వారపు సమీక్ష నిర్వహించారు. మొదటి వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్టుమెంట్ల నుంచి వంతెన వరకు దర్శనానికి వెళ్లే భక్తులు తోపులాటలకు గురికాకుండా ఇకపై నిరంతరం పర్యవేక్షించాలన్నారు. దీనికోసం ఎస్ఈ-2 ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎస్వీ నిత్యాన్న ప్రసాదానికి ఇప్పటివరకు వచ్చిన విరాళాల మొత్తం రూ.800కోట్లకు చేరుకుందన్నారు. అన్నదాన విభాగంపై భక్తులకున్న నమ్మకానికి ఇది నిదర్శనమన్నారు. మరింత శుచి, రుచితో అన్నప్రసాదాలను భక్తులకు అందించాలన్నారు.
తిరుమలలో దుకాణదారులు లైసెన్సు, ధరల పట్టికను బోర్డుల్లో పొందుపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్లో 1,2ల్లోని కంపార్టుమెంట్లలో వేచి ఉండే భక్తులకు అనారోగ్య సమస్యలు ఎదురైతే స్పందించేందుకు వీలుగా డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. లడ్డూ ట్రేలు, అన్నదానంలోని పాత్రలను శుభ్రం చేయడానికి మరిన్ని ఆధునిక యంత్రాలను కొనుగోలు చేయాలన్నారు. కాలినడక, ఘాట్లతోపాటు తిరుమలలోని ఎర్రచందనం మొక్కల పెంపకానికి ట్రీట్మెంట్ ప్లాంట్ నీటిని వినియోగించాలన్నారు. డీఎఫ్వో ఆధ్వర్యంలో టీటీడీలోని అన్ని ఆలయాలను సందర్శించి గోపురాలపై మొలచిన మొక్కలను తొలగించాలన్నారు. అనంతరం సీఆర్వో నుంచి లేపాక్షి వరకు ఉన్న సబ్వే షాపింగ్ కాంప్లెక్స్ను ఈవో తనిఖీ చేశారు. సరైన సౌకర్యాలు లేని కారణంగా భక్తులు ఇక్కడకు సరిగా రాకపోవడంతో వ్యాపారాలు జరగడంలేదని దుకాణదారులు ఈవో దృష్టికి తెచ్చారు. స్పందించిన ఈవో వెంటనే భక్తులకు అవసరమన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆలయ మాడవీధులు, లడ్డూట్రేలు, గంగాళాలను శుభ్రం చేసే స్థలాలను పరిశీలించారు.