తిరుమల: తిరుమల శ్రీవారికి వార్షిక తెప్పోత్సవాలు బుధవారం నుంచి వైభవంగా జరగనున్నాయి. తెప్పను తిరుమల తిరుపతి దేవస్థానం కనువిందుగా విద్యుద్దీపాలతో అలంకరించింది. ఉత్సవాలను వివరిస్తూ తిరుమల వ్యాప్తంగా స్వాగత తోరణాలు, విద్యుద్దీపాలతో విష్ణుమూర్తి దశావతార రూపాలను ఏర్పాటుచేసింది. ఉత్సవాల్లో భాగంగా దేవదేవుడు వివిధ అవతారాల్లో పుష్కరిణిలో తెప్పపై వూరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు. పుష్కరిణి నలువైపులా గట్టుపై నుంచి ఉత్సవాలను వీక్షించేలా తితిదే ఏర్పాట్లు చేసింది. తెప్పోత్సవాల కారణంగా 8, 9 తేదీల్లో వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ, 10, 11, 12 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను తితిదే రద్దుచేసింది. తెప్పోత్సవం టిక్కెట్లు కోరుకునే యాత్రికులు కేంద్రీయ విచారణ కార్యాలయ ఆవరణలోని ఆర్జితం కేంద్రం వద్ద పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అందుబాటులో ఉన్న టిక్కెట్లను లాటరీ విధానం కింద కేటాయిస్తారు.