పాఠశాలల పునఃప్రారంభాన్ని వాయిదా వేయాలని ఈ మేరకు కారణాలను ప్రస్తావిస్తూ.. టీడీపీ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. జూన్ 12 నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించాలన్న నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కారణంగా స్కూళ్ల పునఃప్రారంభం వాయిదా వేయాలని కోరారు. జూన్ రెండవ వారం ముగుస్తున్నా ఇప్పటికీ అధిక ఉష్టోగ్రత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో పాఠశాలలకు విద్యార్థులు హాజరైతే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది అన్నారు. ఎండ వేడికి తట్టుకోలేక మంత్రులు, ఎమ్మెల్యేలు ఏసీ రూముల్లో నుంచి బయటకు రావడం లేదన్నారు. అలాంటిది చిన్న పిల్లలు పాఠశాలలకు ఎలా వస్తారని ప్రశ్నించారు.
ప్రభుత్వానికి స్కూళ్ల ప్రారంభంపై ఉన్న శ్రద్ధ నాడు-నేడు పనులు పూర్తి చేయడంలో ఎందుకు లేదన్నారు ఎమ్మెల్యే సత్యప్రసాద్. మరో వైపు టీచర్లపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని.. రక రకాల యాప్లు తెచ్చి వారిపై పని భారం మోపారన్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే టీచర్లపై వేధింపులు సరికాదని.. అధిక ఉష్టోగ్రతల నేపథ్యంలో విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పాఠశాలల పునఃప్రారంభం పది రోజులు వాయిదా వేయాలని కోరుతున్నారు.