న్యూఢిల్లి :భారత గణతంత్ర దినోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ ఉత్సవాలకు హాజరవుతున్న 10 మంది ఏషియాన్ దేశాల నేతల భద్రతకు ముప్పు పొంచి ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడించడంతో ఢిల్లిలో హై అలర్ట్ ప్రకటించారు. భారత 69వ గణతంత్ర దినోత్సవాలకు ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడొ, వియెత్నాం ప్రధాని గూయెన్ ఫక్, మయన్మార్ స్టేట్ కౌన్సెలర్ ఆంగ్ శాన్ సూకీ, లావోస్ ప్రధాని థాంగ్లౌన్ సిసౌలిత్, మలేషియా ప్రధాని నజీబ్ రజాక్, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టె, సింగపూర్ ప్రధాని లీ సియెన్ లూంగ్, కాంబోడియా ప్రధాని హున్ సేన్, థాయ్లాండ్ ప్రధాని ప్రయూత్ చాన్ ఓచా, సుల్తాన్ బ్రూనై హస్సన్ అల్ బోల్కియా హాజరవుతున్నారు. జమ్ము కాశ్మీర్లోని నియంత్రణాధీన రేఖ వెంట ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా ఢిల్లిలోని జామా మసీదు, మంజు కా తిలా, బాట్లా హౌస్, కృష్ణ నగర్, అర్జున్ నగర్ తదితర ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.