పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా బీజేపీ నందిగ్రామ్ ఎమ్మెల్యే సువేందు అధికారి పేరు ఖాయమైంది. బెంగాల్ ప్రతిపక్ష నాయకుడి ఎంపిక ప్రక్రియను బీజేపీ అధిష్టానం కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ భూపేందర్ యాదవ్కు అప్పగించింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత దీదీ మాజీ సన్నిహితుడు అధికారి 1,956 ఓట్ల తేడాతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని నందిగ్రామ్ నియోజకవర్గంలో ఓడించారు.
పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలకు గానూ పాలక టిఎంసి 213 సీట్లను గెలుచుకోగా, బీజేపీ 77 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలుపొందారు. ముర్షిదాబాద్ జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నికల ఫలితాలు పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర పార్టీ అధ్వర్యంలో జరిగిన సమావేశంలో కొంతమంది సీనియర్లు, పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా పార్టీ ఎన్నికల ఫలితాలపై నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, తమకు రావాల్సిన మరికొన్ని స్థానాలను కోల్పోవడం పట్ల నేతలు కూలం కషంగా చర్చించారు. బీజేఎల్పీ నేతల ఎన్నిక చేపట్టారు. అనంతరం ప్రతిపక్ష నాయకుడిగా సువేందు అధికారితో పాటు మనోజ్ తిగ్గా, ముకుల్ రాయ్ కూడా పోటీలో నిలిచారు. కానీ పార్టీ అధిష్టానం మాత్రం సీఎం మమతా బెనర్జీపై గెలిచిన సువేందు వైపే మొగ్గు చూపింది. బెంగాల్లో ధీటైన ముఖ్యమంత్రిని ఎదుర్కొవడానికి ప్రజా సమస్యలపై పోరాడేందుకు సువేందు నాయకత్వమే సరియైందని బెంగాల్ బీజేపీ నేతలు భావిస్తున్నారు.