ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారతీయుడి గుండెతో పాక్ యువతికి కొత్త జీవితం

national |  Suryaa Desk  | Published : Thu, Apr 25, 2024, 10:28 PM

ఓ భారతీయుడి గుండె పాకిస్థాన్‌ యువతికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెకు చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో విజయవంతంగా అవయవమార్పిడి చికిత్సను నిర్వహించారు. ఈ శస్త్రచికిత్స కోసం ఆస్పత్రితో పాటు ట్రస్టు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా దాతృత్వాన్ని చాటుకున్నారు. పాకిస్థాన్‌‌లోని కరాచీకి చెందిన 19 ఏళ్ల యువతి ఆయేషా రషన్‌ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెకు గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయాలని, ఆ వ్యాధి ఊపిరితిత్తులకు కూడా వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు గుర్తించారు. గుండెమార్పిడి చేయకుంటే ఆమె ఎక్కువకాలం బతకదంటూ తెలిపారు.


ఈ శస్త్రచికిత్సకు సుమారు రూ.35 లక్షలకు పైగా ఖర్చువుతుందని, భారత్‌‌కు తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో తమ కుమార్తె భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే రషన్‌ను ఆదుకునేందుకు ముందుకొచ్చిన చైన్నైకు చెందిన ఐశ్వర్యన్ అనే స్వచ్ఛంద సంస్థ.. భారత్‌లో సర్జరీకి ఏర్పాట్లు చేసింది. చెన్నైలోని ఎమ్‌జీఎమ్‌ హెల్త్‌కేర్‌ ఆస్పత్రిలో నిపుణుల బృందం ఆ యువతికి.. అవయవదానం చేసిన భారతీయుడి గుండెను విజయవంతంగా అమర్చింది. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించి, మానవత్వానికి ఎల్లలు లేవని నిరూపించారు.


ప్రస్తుతం రషన్‌ పరిస్థితి నిలకడగా ఉంది. మీడియాతో మాట్లాడిన ఆమె.. గుండె మార్పిడి తర్వాత తనకు చాలా బాగుందని అన్నారు. తన కుమార్తె ప్రాణాలు నిలిపినందుకు ట్రస్టు, వైద్య బృందానికి ఆమె తల్లి కృతజ్ఞతలు తెలిపారు. రశన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే పాకిస్థాన్‌కు వెళ్తామని చెప్పారు. ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ.. గుండె పనిచేయకపోవడంతో రషన్ ఆస్పత్రిలో చేరారని తెలిపారు. గుండె వైఫల్యం చెందడంతో ఆమెకు ECMO (ఎక్మో)పై చికిత్స కొనసాగించినట్టు పేర్కొన్నారు. అయినప్పటికీ ఆమె గుండె నాళాల్లో దెబ్బతినడంతో గుండె మార్పిడి అవసరమైందని వివరించారు. గుండె లేదా ఊపిరితిత్తుల పనితీరును ప్రభావితం చేసే ప్రాణాంతక అనారోగ్యం లేదా పరిస్థితి విషమించిన వ్యక్తులకు చివరి ఎంపికగా ఎక్మోతో చికిత్స చేస్తారు.


అదృష్టవశాత్తూ ఢిల్లీకి చెందిన అవయవదాత గుండెతో సర్జరీ నిర్వహించినట్టు ఎంజీఎం హెల్త్‌కేర్ డైరెక్టర్ డాక్టర్ కేఆర్ బాలకృష్ణన్, డాక్టర్ సురేశ్‌ రావులు తెలిపారు. విదేశీయుడు అవయదానం పొందలేడు కానీ రషన్‌‌ గుండెను వేగంగా స్వీకరించారని వారు చెప్పారు. ఆరు నెలల కిందట ఢిల్లీకి చెందిన 69 ఏళ్ల వ్యక్తి గుండెను అమర్చినట్టు పేర్కొన్నారు. ఏడాదిన్నరగా ఆమె భారత్‌లో ఉందని అన్నారు.


‘ఆమె నా కూతురు లాంటిది.. ప్రతి ప్రాణం ముఖ్యం.. అవయవ దానం, మార్పిడి శస్త్రచికిత్సల రాజధానిగా చెన్నైకు గుర్తింపు లభించింది’ అని వ్యాఖ్యానించారు. అవయవ దానం, మార్పిడిలో తమిళనాడు ముందుందని, దశాబ్దాల కిందట చేపట్టిన కార్యక్రమాలకు ధన్యవాదాలని అన్నారు. దేశంలో అవయవ మార్పిడి శస్త్రచికిత్సకయ్యే ఖర్చు ఎక్కువగా ఉండటంతో దానం చేసిన అవయవాలు పలు రాష్ట్రాల్లో నిరుపయోగ అవుతున్నాయని, ఈ విషయంలో మెరుగైన విధానం తీసుకురావాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com