ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

national |  Suryaa Desk  | Published : Thu, Apr 25, 2024, 08:19 PM

ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి.. అలాగే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నిత్యం కొన్ని మండలాల్లో వడగాలులు వీస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీచేస్తోంది. ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు లేకపోవడం, సముద్రం నుంచి తేమగాలులు వీయకపోవడంతో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరిగింది. రాయలసీమ, కోస్తాలో పలుచోట్ల వడగాడ్పులు వీయగా.. మరికొన్నిచోట్ల వేడి వాతావరణం కనిపిస్తోంది. రాయలసీమ, కోస్తాలో మారుమూల ప్రాంతాల్లో సైతం గాలిలో తేమశాతం గణనీయంగా పడిపోవడంతో ఉక్కపోత పెరిగింది.


దేశంలోనే అత్యధికంగా ఆదివారం నంద్యాలలో 41.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు, మూడు రోజుల వరకు రాయలసీమ, కోస్తాలో పలుచోట్ల గాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నంద్యాల, కడప, మన్యం జిల్లాల్లోని 37 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం 18 మండలాల్లో వడగాడ్పులు వీచినట్లు పేర్కొంది. పగటి ఉష్ణోగ్రతలు రాయలసీమలో రెండు నుంచి నాలుగు, కోస్తాలో రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని పేర్కొంది. మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.


మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ఎండలు మండుతున్నాయి. మూడు రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చింతపల్లిలో ఆదివారం అత్యధికంగా 36.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. శుక్ర, శనివారాల్లో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు. ఏప్రిల్‌, మే నెలల్లో ఇవి మరింత పెరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో వారపు సంతలు, రహదారుల పక్కన కూరగాయలు అమ్ముతున్నవారు గొడుగునీడన, పరదాల మాటున తలదాచుకుంటున్నారు.


సోమవారం 36 మండలాల్లో వడగాల్పులు, మంగళవారం37 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.ఆదివారం 18 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు తెలిపారు. ఇవాళ కడప, నంద్యాల జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ రెండు జిల్లాల్లో అత్యధికంగా 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. వీలైనంత వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకపోవడం మంచిదని అధికారులు ప్రజలకు సూచనలు చేస్తున్నారు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలనే.. ఒకవేళ వెళితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చిన్న పిల్లలు, పెద్ద వయసువాళ్లకు జాగ్రత్తలు అవసరం అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com