శ్రీకాకుళం జిల్లాలో పలాసలో కరోనాతో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని జేసీబీతో తరలించిన ఘటనపై సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ‘శ్రీకాకుళం జిల్లా పలాసలో కోవిడ్ మృతదేహాన్ని జేసీబీతో తరలించిన ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. మానవత్వాన్ని చూపాల్సిన సమయంలో కొంత మంది వ్యవహరించిన తీరు బాధించింది. ఇలాంటి ఘటనలు మరెక్కడా పునరావృతం కాకూడదు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకతప్పదు’ అని సీఎం ట్వీట్ చేశారు.అసలు ఏం జరిగిందంటే... శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఓ 70 ఏళ్ల వృద్ధుడు అనారోగ్యంతో చనిపోయాడు. ఈ ప్రాంతం కంటైన్మెంట్ జోన్ కావడంతో అంత్యక్రియలకు ముందు డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ లీల ఆదేశాల మేరకు మృతదేహం నుంచి కరోనా పరీక్షలకు నమూనాలను సేకరించారు. అప్పటికప్పుడు ‘వీఎల్ఎం’ కిట్ల ద్వారా కరోనా పరీక్షలు చేశారు. మృతదేహాన్ని శ్మశానానికి తరలిస్తుండగా ఫోన్ కాల్ ద్వారా ట్రూనాట్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. వెంటనే కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, కాలనీవాసులంతా మృతదేహాన్ని వదిలి భయంతో పరుగులు పెట్టారు. దీంతో శానిటరీ ఇన్స్పెక్టర్ సిబ్బందికి పీపీఈ కిట్లు వేయించి మృతదేహాన్ని మున్సిపాలిటీ జేసీబీతో శ్మశానానికి తరలించారు.ఉన్నతాధికారులకు తగిన సమాచారం ఇవ్వకుండానే జేసీబీతో తరలించడం కలకలం రేపింది. పలాస–కాశీబుగ్గలో జరిగిన ఘటన సీఎం కార్యాలయం దృష్టికి వచ్చింది. సీఎంఓ ఆదేశాల మేరకు విచారణ చేసిన శ్రీకాకుళం కలెక్టర్ నివాస్... పలాస మున్సిపల్ కమిషనర్ టి.నాగేంద్రకుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎన్.రాజీవ్లను వెంటనే సస్పెండ్ చేశారు.