ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తోటి పిటిషనర్‌గా హనుమంతుడి పేరు.. రూ.లక్ష జరిమానా వేసిన హైకోర్టు

national |  Suryaa Desk  | Published : Wed, May 08, 2024, 10:34 PM

దేవాలయ నిర్మాణం జరిగిన ఓ ప్రైవేటు స్థలాన్ని కాజేయడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి.. ఏకంగా హనుమంతుడినే తోటి పిటిషనర్‌గా పేర్కొంటూ కోర్టులో కేసు వేశాడు. ఆ భూమి హనుమంతుడిదని, అది ఆయనకే చెందాలని.. ఓ భక్తుడిగా, స్నేహితుడిగా స్థలాన్ని సంరక్షించేందుకు తనకు హక్కులు కల్పించాలని కోరాడు. అయితే, ఈ పిటిషన్‌ను అదనపు డిస్ట్రిక్ట్ కోర్టు తిరస్కరించడంతో అతడు ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాడు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ సి.హరి శంకర్‌ ధర్మాసనం.. ఆ స్థలాన్ని కాజేయాలనే స్వార్థంతో పిటిషన్ వేసినట్టు గుర్తించారు. కక్షిదారు దురుద్దేశాన్ని గుర్తించిన న్యాయమూర్తి.. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా రూ.లక్ష జరిమానా విధించారు. ప్రస్తుత యజమానులకు ఆ సొమ్ము చెల్లించాలని ఆదేశాలు జారీచేసింది.


అంకిత్ మిశ్రా అనే వ్యక్తి హనుమంతుడ్ని సహ పిటిషనర్‌గా పేర్కొంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై అడిషనల్ డిస్ట్రిక్ట్ జిల్లా జడ్జి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం.. మరొకరికి చెందిన ప్రైవేట్ భూమిలో నిర్మించిన మతపరమైన కట్టడం, అందులో ప్రతిష్టించిన దేవతను పూజించడానికి ఇతరులకు ఎటువంటి హక్కు ఉండదు’ అని పిటిషన్‌ను తిరస్కరించారు. దీంతో అతడు హైకోర్టుకు వెళ్లడంతో జస్టిస్‌ సి.హరి శంకర్‌ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.


‘దేవుడు ఏదో ఒకరోజు నా ముందు పిటిషనర్‌గా ఉంటాడని నేనెప్పుడూ అనుకోలేదు. ఏది ఏమైనప్పటికీ అదృష్టవశాత్తూ ఆయన ప్రతినిధి ద్వారా ఈ కేసులో అది జరిగింది.. ప్రయివేట్ స్థలంలో నిర్మితమైన ఆలయంలోకి భక్తుల ప్రవేశం, పూజలకు అనుమతించినా.. అది పబ్లిక్ ప్రాపర్టీ కాదు.. కేవలం పూజలకు అనుమతించినంత మాత్రాన అది పబ్లిక్ దేవాలయంగా మారిపోదు.. ఇది కేవలం ఆ స్థలాన్ని కాజేయాలనే కుట్రగా కనిపిస్తోంది’ అని జస్టిస్ శంకర్ అన్నారు. ఆలయ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని పిటిషనర్‌ను ప్రశ్నించారు.


ఈ ఆలయాన్ని 1997లో నిర్మించారనే వాదన ఉన్నప్పటికీ దానికి కూడా ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఆలయంపై అంకిత్ మిశ్రాకు ఎటువంటి హక్కులేదని జిల్లా కోర్టు న్యాయమూర్తి చెప్పింది సరైందేనని జస్టిస్ హరిశంకర్ సమర్దించారు. అనంతర పిటిషన్‌ను తిరస్కరించిన న్యాయమూర్తి.. పూర్తి హక్కులు ప్రతివాది (సూరజ్ మలిక్)‌కి ఉంటాయని స్పష్టం చేశారు. అంతేకాదు, ఇలాంటి పిటిషన్ వేసినందుకు అంకిత్‌కు రూ.లక్ష జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని మలిక్‌కు నాలుగు వారాల్లో చెల్లించాలని ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com