ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దక్షిణాదివాళ్లు ఆఫ్రికన్స్‌లా ఉంటారు.. మళ్లీ నోరుజారిన శామ్ పిట్రోడా

national |  Suryaa Desk  | Published : Wed, May 08, 2024, 10:23 PM

కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల ఇంఛార్జ్, నాలెడ్జ్ కమిషన్ మాజీ ఛైర్మన్ శామ్ పిట్రోడా మరోసారి నోరుజారి వివాదంలో చిక్కుకున్నారు. భారత్‌లో ప్రజాస్వామ్యం, వైవిధ్యం గురించి వివరించే క్రమంలో తూర్పు రాష్ట్రాల్లో జనం చైనీయులు, దక్షిణాదివాసులు ఆఫ్రికన్స్‌లా ఉంటారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అమెరికాలో అమలవుతోన్న వారసత్వ పన్ను గురించి ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో పదేపదే ప్రస్తావించారు. తాజాగా, ది స్టేట్స్‌మన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో శామ్ పిట్రోడా మరోసారి బీజేపీకి టార్గెట్ అయ్యారు.


  ‘‘భారత్‌లో ఎంతో వైవిధ్యం ఉంది.. 75 ఏళ్లుగా ఎంతో సంతోషకరమైన వాతావరణంలో దేశం ముందుకెళ్తోంది.. ఘర్షణలు, విబేధాలు మరిచిపోయి అంతా ఆనందంగా జీవిస్తున్నారు. ఇక్కడి వైవిధ్యం చాలా గొప్పది.. తూర్పు రాష్ట్రాల్లోని పౌరులు పొరుగున ఉన్న చైనీయుల్లాగే ఉంటారు. ఇక పశ్చిమ భారతంలో అరబ్‌లుగా, ఉత్తరాది పౌరులు శ్వేతవర్ణంలో.. దక్షిణాది వాళ్లంతా ఆఫ్రికన్‌లా కనిపిస్తారు... అయినా మేమంతా సొంత అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటాం’’ అని శ్యాంపిట్రోడా అన్నారు. అయితే, ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది.


‘‘దేశ వైవిధ్యం గురించి పిట్రోడా సారుప్యత చాలా తప్పు.. ఇది ఆమోదయోగ్యం కాదు.. దీనిని భారత జాతీయ కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండిస్తుంది.. అవి అతడి వ్యక్తిగత వ్యాఖ్యలు.. పార్టీతో ఎటువంటి సంబంధం లేదు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ఎక్స్‌లో వెల్లడించారు. ఇక, పిట్రోడా వ్యాఖ్యలపై మణిపూర్ సీఎం బీరేన్ సింగ్, అసోం సీఎం హిమాంత బిశ్వ శర్మ తీవ్రంగా మండిపడ్డారు. ‘సామ్ భాయ్.. నేను ఈశాన్య ప్రాంతానికి చెందిన వ్యక్తినే అయినా.. నేను భారతీయుడిలా కనిపిస్తున్నాను.. మనది వైవిద్యమైన దేశం.. కానీ మనమంతా ఒక్కటే’ అని బీరేన్ సింగ్ కౌంటర్ ఇచ్చారు.నటి కంగనా రనౌత్ సైతం ఇవి జాత్యంహకార వ్యాఖ్యలని ఆగ్రహం వ్యక్తం చేశారు.


మళ్లీ బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ప్రచారం గురించి ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు పిట్రోడా సమాధానం ఇస్తూ.. ఈ రోజు నిజంగా దేశాన్ని బీజేపీ విభజిస్తోంది.. ఇది ఎవరు ఒప్పు లేదా తప్పు అనేది ప్రశ్న కాదు... కానీ మీరు ఏమి నమ్ముతున్నారనేది ప్రశ్న.. లౌకిక దేశం కోసం బ్రిటిషర్లపై మన స్వాతంత్ర్య సమరయోధులు పోరాడారు.. హిందూ దేశం కోసం కాదు.. పాకిస్థాన్ మతప్రాతిపదికన ఏర్పడింది.. ఇప్పుడు ఆ దేశం ఎలాంటి పరిస్థితిలో ఉందో చూస్తున్నాం.. ప్రపంచంలోనే ప్రజాస్వామ్యానికి మనమే నిదర్శనం... అక్కడక్కడా కొన్ని విబేధాలు ఉన్న పక్కనపెట్టి 70-75 ఏళ్లు చాలా సంతోషకరమైన వాతావరణంలో జీవించాం.. అన్నదమ్ముల్లా కలిసి ఉంటూ అన్ని మతాలు, బాషలను, సంప్రదాయాలను.. ఆచార వ్యవహారాలు, ఆహార విహారాలను గౌరవించుకుంటున్నాం ’ అని పిట్రోడా అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com