ఎయిరిండియా విమానయాన సంస్థకు ఉద్యోగులకు షాకిచ్చారు. క్యాబిన్ క్రూ సిబ్బంది మూకుమ్మడిగా సెలవు పెట్టారు. 300 మందికిపైగా సీనియర్ సిబ్బంది చివరి క్షణంలో సిక్ అయ్యామంటూ లీవ్ పెట్టడంతో పలు దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు నిలిచిపోయాయి. వేరే ప్రత్యామ్నాయం లేక 70కి పైగా సర్వీసులను ఆ సంస్థ రద్దుచేసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు వివిధ నగరాలు, విదేశాలకు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానలను రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విమానాశ్రయాల్లో ఎదురుచూసి నానా అవస్థలు పడ్డారు. తమ సిబ్బంది చివరి నిమిషంలో సెలవు పెట్టడంతో విమానాలను నడపడం వీలుపడలేదని, అసౌకర్యానికి క్షమించాలని ప్రయాణికులను ఎయిరిండియా ఓ ప్రకటనలో కోరింది.
ఉద్యోగుల సామూహిక సెలవుల వెనకున్న కారణం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది. దీనిపై ఎయిరిండియా అధికార ప్రతినిధి మాట్లాడుతూ... సిబ్బంది మూకుమ్మడిగా సిక్ లీవ్ పెట్టడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని,డబ్బులు పూర్తిగా తిరిగి చెల్లిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రయాణాన్ని రద్దు చేసుకునేందుకు అంగీకరించినవారికి మరో తేదీకి టికెట్ జారీచేస్తున్నట్టు వివరించారు. సిబ్బంది సామూహిక సెలవుల కారణంగా బుధవారం కూడా పలు సర్వీసులపై ప్రభావం పడే అవకాశం ఉందని, విమానాశ్రయాలకు బయలుదేరే ముందే ఒకసారి ఫ్లైట్ పరిస్థితి గురించి తమ వెబ్సైట్లో చూసుకోవాలని ఆ సంస్థ సూచించింది.
అయితే, దీనిపై సోషల్ మీడియాలో పలువురు ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్ట్లు పెడుతున్నారు. విమానాల రద్దుపై ముందస్తుగా తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని మండిపడుతున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత రద్దయినట్టు తెలిసి తీవ్ర నిరాశతో వెనుదిరగాల్సి వచ్చిందని వాపోతున్నారు. ప్రభుత్వ రంగం విమానయాన సంస్థ ఎయిరిండియా రెండేళ్ల కిందట టాటా గ్రూప్ చేతిలోకి తిరిగి వెళ్లిన విషయం తెలిసిందే. కానీ, ఉద్యోగులు, యాజమాన్యానికి మధ్య పలు అంశాలపై వివాదం నడుస్తోందని తెలుస్తోంది. ముఖ్యంగా లేఓవర్ సందర్భంగా హోటల్ గదిని షేర్ చేసుకోవాల్సిందేనన్న ఆదేశాలపై సిబ్బంది గుర్రుగా ఉన్నట్లు సమాచారం.
దీంతో పాటు పలు ఇతర సమస్యలను ప్రస్తావిస్తూ ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐఎక్స్ఈయూ) ఇటీవల కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు లేఖ రాసింది. దీంతో కేంద్ర కార్మిక శాఖ ఆ సంస్థకు షోకాజ్ నోటీసు జారీచేసింది. కాగా, స్వాతంత్య్రానికి పూర్వం ఎయిరిండియాను టాటా సంస్థలు ప్రారంభించగా.. తర్వాత ప్రభుత్వ రంగంలో విలీనం చేశారు.