ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కిడ్నీలో రాళ్లు తొందరగా పోవాలంటే మూత్రం తాగండి: గూగుల్ ఏఐ

national |  Suryaa Desk  | Published : Wed, May 08, 2024, 09:20 PM

టెక్నాలజీ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. మనిషి రోజుల తరబడి చేసే పనిని టెక్నాలజీ సహాయంతో మెషీన్లు, కంప్యూటర్లు గంటలు, నిమిషాల్లోనే చేస్తున్నాయి. అయితే ఎంత కొత్త టెక్నాలజీ అయినా.. ఎంత తొందరగా జరిగినప్పటికీ.. మనిషి చేసినంత సమర్థవంతంగా చేయలేవనే వాదనలు కూడా ఉన్నాయి. ఇక ఇటీవలి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ.. టెక్నాలజీ రంగంలోనే సరికొత్త విప్లవాన్ని తీసుకువచ్చింది. మనకు ఏ సమాచారం కావాలన్నా అడిగితే క్షణాల్లో మనముందు ఉంచుతుంది. అయితే కొన్నిసార్లు తప్పుదోవ పట్టించేది, తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీవ్ర విమర్శల పాలు అవుతోంది. తాజాగా కిడ్నీలో తొందరగా రాళ్లు పోవాలంటే మూత్రం తాగాలని గూగుల్ ఏఐ అయిన ఎస్‌జీఈ చెప్పడం తీవ్ర విమర్శలకు కారణం అయింది.


ఎస్‌జీఈ అంటే సెర్చ్ జెనరేటివ్ ఎక్స్‌పీరియన్స్. దీన్ని గూగుల్ డెవలప్ చేసింది. జెనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించుకునేందుకు ఈ సెర్చ్ జెనరేటివ్ ఎక్స్‌పీరియన్స్‌ను తీసుకువచ్చింది. అయితే ఓ నెటిజన్.. కిడ్నీలో రాళ్లు తొలగించుకోవడం గురించి ఈ ఎస్‌జీఈని ప్రశ్న అడగ్గా.. అది ఇచ్చిన సమాధానంతో ఖంగుతిన్నాడు. కిడ్నీలో రాళ్లను త్వరగా పోగొట్టుకోవాలంటే మూత్రం తాగాలని ఆన్సర్ వచ్చింది. దీంతో ఆ ఎస్‌జీఈ ఇచ్చిన సమాధానానికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


కిడ్నీలోని రాళ్లను తొందరగా తొలగించుకునేందుకు చిట్కాలు చెప్పాలని ఓ నెటిజన్ గూగుల్‌లో సెర్చ్ చేశాడు. అయితే ఈ ప్రశ్నకు గూగుల్ ఎస్‌జీఈ సమాధానం ఇచ్చింది. ప్రతీ 24 గంటల వ్యవధిలో 2 లీటర్ల మూత్రం తాగితే కిడ్నీలో రాళ్లు తొందరగా తొలగించుకోవచ్చని తెలిపింది. ఇదే కాకుండా మరికొన్ని చిట్కాలను కూడా సూచించింది. నీటిని బాగా తాగాలని.. అల్లం నీళ్లు, లెమన్ లైమ్ సోడా లేదా పండ్ల రసాలు తాగాలని గూగుల్ ఎస్‌జీఈ వెల్లడించింది. ఈ సమాధానాన్ని ఆ వ్యక్తి ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారుతోంది.


ఇక గుగుల్ జెనరేటివ్ ఏఐ ఇచ్చిన సమాధానంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. చాలా మంది నెటిజన్లు గూగుల్ క్వాలిటీ కంట్రోల్‌ గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇక మరో నెటిజన్ మాత్రం చాలా వ్యంగ్యంగా స్పందించాడు. తాను రోజుకు 2 లీటర్ల మూత్రం తాగుతానని.. అందుకే తన కిడ్నీలో రాళ్లు లేవని పేర్కొన్నాడు. కిడ్నీలో రాళ్లు వస్తే డాక్టర్ల వద్దకు వెళ్లి సరైన ట్రీట్‌మెంట్ తీసుకోవాలని.. సొంత వైద్యం చేసుకోవడం డేంజర్ అని మరికొందరు నెటిజన్లు తెలిపారు. ఇలాంటి సంఘటనలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను నమ్మడం, రక్షణ వంటి వాటిపై వస్తున్న సవాళ్లను ఎత్తి చూపుతున్నాయని అంటున్నారు. ఈ ఘటనతో గూగుల్ అప్రమత్తం అయింది. ఆ సమాధానాన్ని సరిచేసి.. సమస్యను పరిష్కరించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com