చైనా, భారత్ మధ్య కొనసాగుతున్న ఘర్షణాత్మక వాతావరణంపై ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు చేస్తున్నా... సరిహద్దుల్లో మాత్రం ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయని పార్లమెంట్లో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి విమర్శించారు.
చైనా చొరబాట్లు అంతమయ్యేవి కావని, చైనా అత్యంత దూకుడు ప్రదర్శిస్తోందని పేర్కొన్నారు. ఇలా జరుగుతుండటంతో సామాన్యుడిలో బాధ మరింత పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చైనా చొరబాట్లను సమర్థవంతంగా తిప్పి కొట్టడంలో మన దేశ ఆర్మీని ఆయన కొనియాడారు.
దౌత్యపరమైన మార్గాల ద్వారా మాత్రమే చైనాతో తలెత్తిన విభేదాలను ప్రభుత్వం పరిష్కరించాలని చూస్తోందని, అది మంచి మార్గమేనని పేర్కొన్నారు. అయితే పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోందని ఆయన హెచ్చరించారు. చైనా భారత్ను బెదిరించాలని చూస్తోందని, అయితే భయపడే తత్వం భారత్కు లేదని స్పష్టం చేశారు. వారికి ఏ భాషైతే అర్థమవుతుందో... ఆ భాషలోనే జవాబివ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
పార్లమెంట్ సమావేశాల కంటే ముందే ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించాలని, సరిహద్దుల్లోని పరిస్థితులపై దేశానికి చెప్పాలని డిమాండ్ చేశారు. దేశం మొత్తం ప్రధాని మోదీ వెంటే ఉందని ఆయన ప్రకటించారు. లడఖ్ నుంచి అరుణాచల్ వరకూ చైనా చొరబడుతోందని, ఇది అత్యంత ఆందోళన కలిగించే విషయమని అధీర్ రంజన్ పేర్కొన్నారు.