ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైసీపీ నాయకత్వం షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఇచ్చే వివరణను బట్టి ఆయనపై చర్యలు ఉంటాయని వైసీపీ నాయకత్వం ప్రకటించారు. తాజాగా తనకు పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసుపై స్పందించిన రఘురామ కృష్ణంరాజు... పార్టీ తరుఫున షోకాజ్ నోటీస్ పంపిన విజయసాయిరెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని ఎలా ఉంటుందన్న ఆయన... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ నోటీస్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ సంఘం ఉందా అని ప్రశ్నించారు. ఆ క్రమశిక్షణ సంఘానికి ఎన్నికల గుర్తింపు ఉందా ? అని వ్యాఖ్యానించారు. క్రమశిక్షణ సంఘానికి ఛైర్మన్, సభ్యులెవరని అన్నారు. క్రమశిక్షణ సంఘం మినిట్స్ ఉంటే తనకు పంపాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని కోరారు.