కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ సందర్భంగా వైరల్ అవుతున్న కొన్ని ఫేక్ న్యూస్ తో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఒక వీడియో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. బ్రెడ్ ప్యాకెట్లను మూసివేసేటప్పుడు ఒక వ్యక్తి తన ఉమ్మిని వేళ్ళతో బ్రెడ్ ప్యాకెట్లపై ఉంచే వీడియో ఫేస్ బుక్, ట్విట్టర్లలో మతపరమైన అండర్ టోన్లతో వైరల్ అయ్యింది. "స్పిట్ జిహాద్" అనే హ్యాష్ట్యాగ్తో ఈ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యింది. ఇది భారత్ లో జరిగిందని చాలామంది షేర్ చేస్తున్నారు. దీనిపై నెటిజన్ల నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.కాగా, ఇండియా టుడే ఇది పక్కా ఫేక్ న్యూస్ అని తేల్చింది. సంస్థకు చెందిన యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూమ్ ఇది ఫిలిప్పైన్స్ లో గతేడాది సెప్టెంబర్ లో జరిగిన సంఘటనకు చెందిన వీడియోగా తేల్చింది. ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మవద్దని ప్రజల్ని కోరింది.