అక్రమ మైనింగ్తో ఏపీ, కర్నాటక రాష్ట్రాల సరిహద్దులు చెరిపివేశారన్న ఆరోపణలతో 14 ఏళ్లుగా మైనింగ్ జరుపుకుండా నిలుపుదల చేశారని ఓబులాపురం మైనింగ్ కంపెనీ న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కేంద్ర పర్యావరణ కమిటి పరిశీలన జరిపి కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసిందని న్యాయవాదులు తెలిపారు. సీఈసీ సూచనలతో రాష్ట్రాల సరిహద్దులను ఖరారు చేస్తూ.. కేంద్రం రెండు రాష్ట్రాలకు ఆదేశాలు పంపిందని వాటిని రెండు రాష్ట్రాలు ఆమోదించాయని ఓబులాపురం సంస్థ న్యాయవాదులు వెల్లడించారు. సరిహద్దు వివాదం కొలిక్కి వచ్చిన నేపథ్యంలో మైనింగ్ లీజులకు సంబంధించిన సరిహద్దులను కూడా ఖరారు చేసి తిరిగి మైనింగ్ జరుపుకునే వెసులుబాటు కల్పించాలని న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. అక్రమ మైనింగ్ సరిహద్దులు చెరిపివేతపై దాఖలైన ప్రధాన పిటిషన్తో పాటే దీనిని విచారిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. జులై చివరి వారంలో విచారణ చేపడుతామని ధర్మాసనం స్పష్టం చేసింది.